కేరళలోని కొచ్చి వేదికగా జరిగిన 70వ ఫిలింఫేర్ సౌత్ అవార్డ్స్ వేడుక కనుల పండువగా ముగిసింది. అయితే, ఈ వేడుకలో జరిగిన ఒక సంఘటన మెగా డాటర్, నటి, నిర్మాత నిహారిక కొణిదెలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, మొదటి అవార్డు అందుకున్న నటీనటుల పట్ల నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
Also Read : Killer : ‘కిల్లర్’ టీజర్ అవుట్.. మల్టీ షేడ్స్ జ్యోతి పూర్వజ్ అరాచకం.. !
ఈ వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమల నుంచి ఉత్తమ డెబ్యూ (నూతన పరిచయం) అవార్డులు గెలుచుకున్న యంగ్ యాక్టర్లకు స్టేజ్పై మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దీనిపై నిహారిక స్పందిస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.. ఆ ఒక్క నిమిషం వాళ్ళ కల అంటూ ‘ఒక ఆర్టిస్ట్ జీవితంలో డెబ్యూ అవార్డు అనేది మరిచిపోలేని మైలురాయి. ఆ వేదికపై నిలబడి రెండు మాటలు మాట్లాడటం వాళ్ళ జీవితకాల కల. కానీ ఆ అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం. అవార్డు వేడుకల్లో సమయ పరిమితులు ఉంటాయని తనకు తెలుసు. కానీ మొదటిసారి అవార్డు అందుకున్న వారికి కనీసం ఒక నిమిషం కేటాయిస్తే అది వాళ్ళ ప్రయాణానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని నిహారిక పేర్కొన్నారు.
కాగా నిహారిక చేసిన ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది.. ‘కొత్త ప్రతిభను ప్రోత్సహించాల్సింది పోయి, ఇలా మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకపోతే ఎలా? అంటూ నెటిజన్లు ఫిలింఫేర్ నిర్వాహకులపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిర్మాతగా ఎప్పుడూ చిన్న సినిమాలను, కొత్త టాలెంట్ను ప్రోత్సహించే నిహారిక.. ఈసారి కూడా కొత్త నటీనటుల గొంతుకగా మారి వారి ఆవేదనను ప్రతిబింబించారంటూ సినీ వర్గాలు ఆమెను అభినందిస్తున్నాయి.
