MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్

Neet Aspirant Akanksha

Neet Aspirant Akanksha

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన మగనియా గ్రామంలో ఓ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. నీట్ (NEET) పరీక్ష రాసిన ఆకాంక్ష చతుర్వేది అనే విద్యార్థిని ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో 650 మార్కులు వస్తాయని ఆకాంక్ష ఆశించింది. పేపర్ లీక్ కావడం, పరీక్ష రద్దు కావడం వంటి పరిణామాలతో తీవ్ర డిప్రెషన్‌కు లోనై ఈ దారుణమైన నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకాంక్ష కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేనప్పటికీ, ఆమె తండ్రి కృష్ణ కుమార్ చతుర్వేది కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 3 లక్షల రూపాయల రుణం తీసుకుని మరీ కూతురిని నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో చదివించారు. వృత్తిరీత్యా రైతు అయిన తండ్రి, కూతురి చదువు కోసం నాగ్‌పూర్‌లో వంటవాడిగా (కుక్) సైతం పనిచేశారు. నీట్ పరీక్ష ముగిసిన తర్వాత ఈసారి ఎలాగైనా కూతురు డాక్టర్ అవుతుందని ఆ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉంది. కానీ పేపర్ లీక్ వార్త వారి సంతోషాలను ఆవిరి చేసింది. ఆత్మహత్య జరిగిన ప్రదేశంలో లభించిన సూసైడ్ నోట్‌ మరింత కన్నీరు పెట్టించింది. “సారీ మమ్మీ, పాపా.. నాపై ఎంతో నమ్మకంతో నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. కానీ నాకు మళ్లీ నీట్ పరీక్ష రాసే ధైర్యం లేదు. మిమ్మల్ని నష్టాల్లోకి నెట్టేశాను. మళ్లీ రాసినా పరీక్ష బాగానే అవుతుందనే గ్యారెంటీ లేదు” అని ఆకాంక్ష తన బాధను రాసుకొచ్చింది.

ఇక, నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్ష రద్దు కావడం దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులకు పెద్ద షాక్‌గా మారింది. మే 3న జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు మే 7 సాయంత్రం ఎన్‌టీఏ (NTA) గుర్తించింది. దీంతో విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించి, మే 12న పరీక్షను పూర్తిగా రద్దు చేశారు. ఆ తర్వాత మే 15న విద్యా మంత్రిత్వ శాఖ, ఎన్‌టీఏలు మే 21న తిరిగి పరీక్ష (రీ-ఎగ్జామ్) నిర్వహిస్తామని ప్రకటించాయి. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ (CBI) విచారిస్తుండగా, ఇప్పటివరకు 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఒకవైపు ఈ పరీక్షా విధానంలో మార్పులు తెచ్చి పెన్-పేపర్ మోడ్‌కు బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్షను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతుండగా, మరోవైపు లీకేజీ నెట్‌వర్క్‌కు చెందిన నిందితులపై దర్యాప్తు సంస్థలు తమ పట్టును బిగిస్తూ చర్యలను వేగవంతం చేశాయి.

×
×
Ad