NASA ISRO Moon Base: చంద్రునిపై దీర్ఘకాలిక మానవ అన్వేషణ, పరిశోధనలకు సన్నాహాలు చేస్తున్న అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. భారత్కు కీలక ఆహ్వానం అందించింది. ఆర్టెమిస్ మిషన్లో భాగంగా చేపడుతున్న చంద్ర స్థావరం కార్యక్రమంలో ఇస్రో కూడా భాగస్వామి కావాలని నాసా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ భాగస్వామ్యంతో భారత్, అమెరికా మధ్య అంతరిక్ష సహకారం మరింత బలోపేతం కానుంది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో భారత్, అమెరికా అధికారుల మధ్య జరిగిన కీలక సమావేశంలో అంతరిక్ష శాస్త్రం, మానవ అంతరిక్ష యానం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రునిపై భవిష్యత్ మానవ నివాసానికి సంబంధించిన ప్రణాళికల్లో ఇస్రో భాగస్వామ్యాన్ని నాసా కోరినట్లు తెలుస్తోంది.
చంద్రునిపై మానవులు సుదీర్ఘకాలం నివసించి, పనిచేసేలా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తొలుత రోవర్లు, రోబోట్లు, ఇతర శాస్త్రీయ పరికరాలను చంద్రుడిపైకి పంపి అక్కడి నేల, వనరులపై పరిశోధనలు చేయనుంది. ముఖ్యంగా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని మంచు భవిష్యత్ మానవ మిషన్లకు కీలక వనరుగా భావిస్తున్నారు. ఆర్టెమిస్ మిషన్ ద్వారా మానవులను తిరిగి చంద్రుడిపైకి పంపేందుకు నాసా సన్నాహాలు చేస్తోంది. భవిష్యత్లో చేపట్టే దీర్ఘకాలిక చంద్ర యాత్రలకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా, చంద్రునిపై స్థిరమైన కార్యకలాపాలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై కూడా దృష్టి సారిస్తోంది.
ఇక, భారత్ ఇప్పటికే చంద్ర అన్వేషణలో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. 2023లో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా పలు కీలక పరిశోధనలు నిర్వహించింది. భారత్ కూడా స్పేస్ విజన్ 2047లో భాగంగా ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2040 నాటికి భారత వ్యోమగాములను చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపైనా ఇస్రో కసరత్తు చేస్తోంది. 2028 నాటికి తొలి మాడ్యూల్ను ప్రయోగించే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తోంది.
నాసా, ఇస్రో మధ్య సహకారం ఇప్పటికే కొనసాగుతోంది. 2025లో ప్రయోగించిన నిసార్ ఉపగ్రహ మిషన్ కోసం రెండు సంస్థలు కలిసి పనిచేశాయి. అంతేకాకుండా భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా 2025లో ఆక్సియమ్-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. తాజాగా చంద్రునిపై మానవ స్థావరం ఏర్పాటులోనూ ఇస్రో భాగస్వామ్యం కోరడం భారత్-అమెరికా అంతరిక్ష సహకారంలో మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ భాగస్వామ్యం భవిష్యత్ చంద్ర అన్వేషణ, మానవ అంతరిక్ష యానంలో ఇరు దేశాలకు కొత్త అవకాశాలను తెరవనుంది.

