Nara Lokesh Urges Youth to Prepare For Govt Job: ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది 2026 సందర్భంగా శుభవార్త అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 10,060 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల అవుతాయో, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తామో స్పష్టంగా జాబ్ క్యాలెండర్లో వెల్లడించామని తెలిపారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. పరీక్షలు నిర్వహించి, అన్ని పోస్టులను సమయానికి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులకు పారదర్శకత కల్పించేందుకు సిలబస్ను కూడా ముందుగానే ప్రకటిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
ఉద్యోగార్థులు నైపుణ్యం పోర్టల్లో వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకుని.. అన్ని అప్డేట్స్, అలర్ట్స్ పొందవచ్చని మంత్రి లోకేశ్ సూచించారు. దీంతో అభ్యర్థులు ఎటువంటి సమాచారాన్ని కోల్పోకుండా సకాలంలో సిద్ధం కావడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇకపై ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ఉద్యోగాల ప్రకటన పండుగలా నిర్వహిస్తామని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. చివరిగా రాష్ట్రంలోని ఉద్యోగార్థులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ.. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి సూచించారు.
