మలయాళ చిత్ర పరిశ్రమలో ‘దృశ్యం’ సిరీస్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి రెండు భాగాలు భాషా తో సంబందం లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం 3’ (Drishyam 3) విషయంలో చిత్ర బృందం అనుసరిస్తున్న వ్యూహం మాత్రం అత్యంత విచిత్రంగా ఉంది.
నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ గల్ఫ్ దేశాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల (Geopolitical Tensions) కారణంగా సినిమాను మే 21కి వాయిదా వేశారు. అయితే విడుదల తేదీకి కేవలం నాలుగు వారాల సమయం మాత్రమే ఉన్నా, ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. సినిమా మళ్లీ వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, మేకర్స్ మే 21నే రాబోతున్నామని మౌనంగా స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా భారీ చిత్రాలకు నెలల ముందే ప్రమోషన్స్ మొదలుపెడతారు. కానీ ‘దృశ్యం 3’ టీమ్ మాత్రం దీనికి భిన్నంగా వెళ్తోంది. కానీ కేవలం ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్పైనే ఆధారపడటం వల్ల బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ దెబ్బతినే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని సస్పెన్స్ను కాపాడటం కోసమే మేకర్స్ ఇలా కంటెంట్ను బయటపెట్టడం లేదా? లేక ఇది ఒక రకమైన వినూత్న ప్రచార శైలా? అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ఇక గతంలో లాగా అన్ని భాషల్లో ఒకేసారి కాకుండా, ఈసారి కేవలం మలయాళంలోనే సినిమాను విడుదల చేస్తున్నారు. మరి తెలుగు (వెంకటేష్), హిందీ (అజయ్ దేవగన్) రీమేక్ వెర్షన్లు ఎప్పుడు వస్తాయి? అసలు అవి ఇప్పుడే మొదలవుతాయా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. మోహన్లాల్ (జార్జ్ కుట్టి), మీనా, అన్సిబా హసన్ మరియు ఎస్తేర్ అనిల్ మళ్లీ తమ పాత పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషన్స్ లేకుండా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి గర్జన చేస్తుందో చూడాలి. ఒకవేళ ఈ వ్యూహం వర్కవుట్ అయితే, భవిష్యత్తులో మిగిలిన దర్శకులు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉంది.
