Gottipati Ravi Kumar: వైఎస్ జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యింది!

  • చార్జీల భారం కచ్చితంగా జగన్ రెడ్డిదే
  • జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయి
  • పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణం అయ్యారు
Gottipati Ravi Kumar

Gottipati Ravi Kumar

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (ఏపీ జెన్‌కో) సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మండిపడ్డారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై జగన్ ధర్నాకు పిలుపునిచ్చారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ రెడ్డిదే అని, సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయని ఎద్దేవా చేశారు. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ ఈఆర్సీని కోరారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు.

‘తుగ్లక్ చర్యల్లో వైఎస్ జగన్ మరో మైలురాయి దాటారు. తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారు. ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిదే. సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయి. పీపీఏల రద్దు, సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణం అయ్యారు. జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యింది. రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ ఈఆర్సీని కోరారు. నేడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. జగన్ హయాంలోనే వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరాయి. వాయిదా వేస్తూ కమిషన్ ముగిసే మూడు రోజుల ముందుగా వసూళ్లకు ఆదేశాలు ఇచ్చారు’ అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.