ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ‘మేడారం’ సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం (ఫిబ్రవరి 12) నుంచి ప్రారంభం కానుంది. వనదేవతలు సమ్మక్క-సారలమ్మ చిన్నజాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరగనుంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహాజాతర జరుగుతుంది. మధ్యలో వచ్చే ఏడాది మాత్రం మినీ జాతరగా నిర్వహిస్తారు. మినీ జాతర భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు.
ఈరోజు మండమెలిగే పండుగతో మినీ జాతరను ప్రారంభిస్తారు. గురువారం మండమెలిగే పూజలు, శుక్రవారం భక్తుల మొక్కుల చెల్లింపు, శనివారం చిన్నజాతర నిర్వహిస్తారు. మినీ జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.5.30 కోట్లు కేటాయించింది. నాలుగు రోజులు జరుగనున్న జాతరలో భక్తుల సౌకర్యార్థం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసులతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది వెయ్యి మందికి పైగా విధుల్లో పాల్గొంటున్నారు.
Also Read: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి జస్ప్రీత్ బుమ్రా ఔట్!
జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. మినీ జాతరకు 20 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. జాతర నేపథ్యంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మ దర్శనం కోసం భక్తులు ఇప్పటికే భారీగా తరలివచ్చారు. దీంతో మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.