NTV Telugu Site icon

Marri Rajasekhar: ప్రస్తుతానికి రాజీనామా చేశా.. అన్ని విషయాలు వెల్లడిస్తా!

Marri Rajasekhar Resigns

Marri Rajasekhar Resigns

ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా రాజీనామా చేశా అని, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మైన్‌ను కోరా అని మర్రి రాజశేఖర్ తెలిపారు. చిలకలూరిపేట వెళ్లి వైసీపీ సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తానని చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడాక తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని, ఆ తర్వాత రాజీనామాకు గల కారణాలపై అన్ని విషయాలు వెల్లడిస్తా అని మర్రి రాజశేఖర్ చెప్పుకొచ్చారు. శాసనమండలి లాబీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు.

ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడారు. ఈ జాబితాలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ సహా మర్రి రాజశేఖర్ ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి మర్రి పార్టీలో ఉన్నారు. 2014లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావుపై ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి విడుదల రజని వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. విడుదల రజనికి టికెట్ ఇవ్వడంతో అసంతృప్తిగా ఉన్న మర్రికి ఎమ్మెల్సీ ఇస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మాట ప్రకారం ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.

అయితే మాజీ మంత్రి విడుదల రజినికి ఇటీవల చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జి బాధ్యతలను వైఎస్ జగన్ అప్పగించారు. తన సొంత నియోజకవర్గంలో మరోసారి రజినిని తీసుకురావడంపై మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. మర్రి పార్టీని వీడి వెళ్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. నేడు ఎమ్మెల్సీగా ఆయన రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనునాన్రు. మర్రి టీడీపీలో చేరతారని తెలుస్తోంది.