LIC Adani controversy: ఎల్ఐసీ–అదానీ వ్యవహారంలో కొత్త ట్విస్ట్.. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్‌లో నిజమెంత!

Lic Adani Controversy

Lic Adani Controversy

LIC Adani controversy: ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అదానీ అమెరికాలో చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ తాజాగా ఎల్ఐసీ–అదానీ వ్యవహారంపై ఒక సంచలన కథనాన్ని తీసుకొచ్చింది. దీనిని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తీవ్రంగా ఖండించింది. ఇంతకీ ఎల్ఐసీ–అదానీ వ్యవహారంపై వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్‌లో ఏముందంటే.. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కంపెనీలలో $3.9 బిలియన్లు లేదా దాదాపు రూ.33 వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వ అధికారులు LICపై ఒత్తిడి తెచ్చారని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. అయితే ఈ నివేదికను ఎల్ఐసీ తీవ్రంగా ఖండించింది.

READ ALSO: Prabhas : మరో సీక్వెల్ లో ప్రభాస్..?

ఎల్ఐసీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది..
తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎల్ఐసీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా సంస్థ LIC తన పెట్టుబడి నిర్ణయాలన్నింటినీ స్వతంత్రంగా తీసుకుంటుందని స్పష్టం చేసింది. అలాగే వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్‌ను తీవ్రంగా ఖండించింది. అదానీ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడానికి రోడ్‌మ్యాప్ ఉన్న పత్రం లేదా ప్రణాళిక ఏదీ లేదని LIC ఈ పోర్ట్‌లో స్పష్టంగా పేర్కొంది.

వాషింగ్టన్ పోస్ట్ ఆరోపణలు తప్పుడు, నిరాధారమైనవిగా, సత్యానికి దూరంగా ఉన్నాయని పేర్కొంది. నివేదికలో పేర్కొన్నట్లుగా అదానీ గ్రూప్‌లో నిధులను పెట్టుబడి పెట్టడానికి LIC ఎప్పుడూ ఎటువంటి పత్రం లేదా ప్రణాళికను సిద్ధం చేయలేదు అని ఎల్ఐసీ సంస్థ పేర్కొంది. ” మా పెట్టుబడి నిర్ణయాలన్నీ బోర్డు ఆమోదించిన విధానాలకు అనుగుణంగా పూర్తిగా శ్రద్ధ వహించిన తర్వాత స్వతంత్రంగా తీసుకుంటామని సంస్థ వెల్లడించింది. ఆర్థిక సేవల విభాగం లేదా మరే ఇతర సంస్థ ఈ నిర్ణయాలలో ఎటువంటి పాత్ర పోషించదు” అని పేర్కొంది.

అసలు ఏం జరిగింది..
అదానీ గ్రూప్ షేర్లలో ప్రజా ధనాన్ని పెట్టుబడిగా పెట్టడానికి ప్రభుత్వ అంతర్గత వర్గాలు LICని బలవంతం చేశాయని వాషింగ్టన్ పోస్ట్ శుక్రవారం ఒక ప్రత్యేక నివేదికను ప్రచురించింది. దీంతో ఈ వివాదం చెలరేగింది. అదానీ కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టమని LICపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు వాషింగ్టన్ పోస్ట్ తన నివేదికలో ఆరోపించింది. అయితే LIC ఇప్పుడు ఈ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించింది. అదానీ లేదా మరే ఇతర కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఎటువంటి ఒత్తిడి లేదా రహస్య ప్రణాళిక సంస్థకు లేదని స్పష్టంగా పేర్కొంది.

పలు నివేదికల ప్రకారం.. అదానీ గ్రూప్ షేర్లలో LIC పెట్టుబడి దాని మొత్తం ఆస్తులలో 1% కంటే తక్కువ. ఇంకా చెప్పాలంటే.. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ షేర్లు మార్కెట్లో పడిపోయినప్పుడు LIC ఈ పెట్టుబడులు పెట్టింది. తరువాత అన్ని ఆరోపణల నుంచి అదానీ గ్రూప్ బయటపడి షేర్లు పెరిగినప్పుడు, LIC గణనీయమైన లాభాలను కూడా ఆర్జించింది. LIC తన పెట్టుబడి నిర్ణయాలు స్వతంత్రంగా, పారదర్శకంగా ఉన్నాయని, వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పూర్తిగా తప్పుదారి పట్టించే విధంగా ఉందని వెల్లడించింది.

READ ALSO: US Venezuela Tensions: కరేబియన్‌కు అమెరికా సైన్యం.. వెనిజులాపై యూఎస్ దాడి చేస్తుందా?