NTV Telugu Site icon

Kolkata: రైల్వే క్రాసింగ్ గేట్‌లోపలికి వచ్చేసిన కారు.. వేగంగా ఢీకొట్టిన రైలు

Cartrain

Cartrain

ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం రైలు ప్రమాదానికి కారణమైంది. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే పెద్ద ముప్పే జరిగి ఉండేది. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది.

పశ్చిమ బెంగాల్‌లోని ఖర్దాహా స్టేషన్ సమీపంలో ఒక కారు మూసి ఉంచిన లెవెల్ క్రాసింగ్ గేటు దాటి ముందుకు వెళ్లింది. ఆ సమయంలో వేగంగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఆ కారుతో పాటు పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హజార్దువారీ ఎక్స్‌ప్రెస్ వేగం తక్కువ ఉండడంతో ప్రమాదం తప్పిందని తూర్పు రైల్వే ప్రతినిధి తెలిపారు. అలాగే ఎస్‌యూవీ వాహనంలో ప్రయాణీకులెవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. ఇక డ్రైవర్‌కు కూడా పెద్దగా గాయాలు కాలేదని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. గేట్‌మ్యాన్.. హెచ్చరిక సిగ్నల్ ఇచ్చినా కూడా కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా గేట్ లోపలికి వచ్చేశాడు. డ్రైవర్ బేఖాతరు చేయడం వల్లే ఈ సంఘటన జరిగిందని రైల్వే ప్రతినిధి తెలిపారు. రాత్రి 8.40 గంటల సమయంలో పట్టాలు దాటేందుకు ప్రయత్నించే క్రమంలో కారు వెనుక వైపు రైలు ఇంజన్ ఢీ కొట్టిందని పోలీసులు తెలిపారు. కారును ఢీకొనడంతో రైలు ఆగిపోయిందని రైల్వే, GRP సిబ్బంది తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఇక కారు డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడు. తూర్పు రైల్వే పోలీసులుమాత్రం అతనిపై FIR నమోదు చేశారు. కేసు దర్యాప్తును కొనసాగించాలని రాష్ట్ర పోలీసులను కోరింది. ప్రాథమిక నివేదికల ప్రకారం డ్రైవర్‌కు ఎటువంటి గాయాలు కాలేదు. ఎక్స్ ప్రెస్ రాత్రి 9.02 గంటలకు ఖర్దాహా స్టేషన్ నుంచి బయలుదేరింది. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటించాలని తూర్పు రైల్వే విజ్ఞప్తి చేసింది.