టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క, కే రాంప్ సినిమాల హిట్స్ తో జోష్ మీదున్న ఈ హీరో ప్రస్తుతం సాయి రాజేష్ డైరెక్షన్ లో చెన్నై లవ్ స్టోరీ అని సినిమా చేస్తున్నాడు. అయితే కేవలం నటుడిగానే కాకుండా, కథలపై పట్టున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, కిరణ్ అబ్బవరం త్వరలోనే మెగాఫోన్ పట్టబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ను మే నెల నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం దర్శకత్వం వహించడమే కాకుండా, కిరణ్ ఈ కథపై చాలా కాలంగా వర్క్ చేస్తున్నారట. వైవిధ్యమైన కథాంశంతో రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక ఈ సినిమాలో నటీనటుల ఎంపిక విషయంలో కిరణ్ అబ్బవరం ఎక్కడా తగ్గడం లేదు. కొన్ని కీలక పాత్రల కోసం ప్రముఖ నటులు అరవింద్ స్వామి, కన్నడ వెర్సటైల్ యాక్టర్ రాజ్ బి. శెట్టి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కిరణ్ అనుకొన్నట్లుగా ఈ దిగ్గజ నటులు గనుక ప్రాజెక్ట్లో చేరితే, ఈ సినిమా రేంజ్ మరింత పెరగడం ఖాయం. కిరణ్ అబ్బవరం దర్శకుడిగా తన అదృష్టాన్ని ఎలా పరీక్షించుకుంటారో చూడాలి. మరోవైపు కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరించిన తిమ్మరాజు పల్లి టీవీ ఏప్రిల్ 17న రిలీజ్ కు రెడీ అయింది.
