Site icon NTV Telugu

Khamenei: ఖమేనీ వీలునామాలో షాకింగ్ రాతలు.. వాట్ నెక్ట్స్!

Khamenei

Khamenei

అయతుల్లా అలీ ఖమేనీ.. దివంగత ఇరాన్ సుప్రీం లీడర్. అత్యున్నత పదవిలో ఉండగా గత నెల 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో హతమయ్యారు. ఖమేనీతో సహా కుటుంబ సభ్యులు.. ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు.

ఇక ఖమేనీ హతమయ్యాక.. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడైన మోజ్తాబా నియమితులయ్యారు. శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మోజ్తాబాను ఖమేనీ స్థానంలో కూర్చుండ బెట్టింది. అయితే మోజ్తాబాను ఇరాన్ సుప్రీం లీడర్‌గా నియమించడంపై ఇరాన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అటు ప్రజల్లోనూ.. ఇటు మతాధికారుల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వచ్చినట్లుగా అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి.

ఖమేనీ వీలునామా..
ఇదిలా ఉండగా తాజాగా ఖమేనీ రాసిన వీలునామా వెలుగులోకి వచ్చింది. ఇందులో సంచలన విషయాలను పొందుపరిచారు. తన వారసుడిగా.. ఇరాన్ సుప్రీం లీడర్ స్థానంలో కుమారుడైన మోజ్తాబాను నియమించవద్దని వీలునామాలో స్పష్టంగా రాసినట్లుగా నివేదికలు అందుతున్నాయి. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో వెల్లడించింది. తన వారసుడిగా కుమారుడిని నియమించడం ఏ మాత్రం ఇష్టం లేదని ఖమేనీ వీలునామాలో స్పష్టంగా రాసినట్లుగా తెలిపింది.

వాస్తవంగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తాబాను నియమించడం చాలా మందికి ఇష్టం కూడా లేదని కథనంలో తెలిపింది. చాలా తక్కువ మంది మాత్రమే కోరుకున్నారని పేర్కొంది. తన వారసుడిగా ఆ స్థానంలో ఉండటానికి మోజ్తాబా ఏ మాత్రం సరిపోడని ఖమేనీ పొంది పరిచినట్లుగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరానియన్ నిఘా నెట్‌వర్క్‌లతో సంబంధాలున్న ప్రతిపక్ష గ్రూప్ నేషనల్ యూనియన్ ఫర్ డెమోక్రసీ పరిశోధన డైరెక్టర్ ఖోస్రో ఇస్ఫహానీ ఈ మేరకు తెలియజేసినట్లుగా కథనంలో రాసుకొచ్చింది.

దేశాన్ని నడపడానికి అవసరమైన అనుభవం, రాజకీయ సామర్థ్యం మోజ్తాబాకు లేదని ఖమేనీ నమ్ముతారని ఖోస్రో ఇస్ఫహానీ అన్నారు. మోజ్తాబా ఒక నపుంసక మతాధికారి మాత్రమేనని.. రాజకీయ జీవితంలో సాధించింది కూడా ఏమీ లేదని పేర్కొన్నారు. వాస్తవంగా సుప్రీం నాయకుడిని ఎన్నుకునే బాధ్యత క్లరికల్ సంస్థ అయిన నిపుణుల సభ నిర్ణయిస్తుందని.. కానీ ఆ విధంగా జరగలేదన్నారు. అంతా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడి మేరకు జరిగిపోయిందని స్పష్టం చేశారు.

మోజ్తాబా కౌన్సిల్ నుంచి మెజారిటీ ఓట్లను కూడా పొందలేదని.. కేవలం IRGC ఒత్తిడి కారణంగా జరిగిందని.. చాలా మంది మతాధికారులు వారసుడిని అధికారికంగా ప్రకటించిన తర్వాత సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయరని ఖోస్రో ఇస్ఫహానీ చెప్పుకొచ్చారు. ఎక్కువ మంది మతాధికారులు మోజ్తాబా నియామకాన్ని వ్యతిరేకించారని తెలిపారు. మోజ్తాబాను ఒక తోలు బొమ్మలా చూస్తారని.. తమ కంట్రోల్‌లో ఉంచుకునేందుకే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ విధంగా చేసిందని ఖోస్రో ఇస్ఫహానీ వెల్లడించారు.

ఇక మోజ్తాబా నియామకాన్ని ట్రంప్ కూడా తప్పుపట్టారు. శాంతియుతంగా ఎంత కాలం జీవించలేరని హెచ్చరించారు. వెనిజులా తరహాలోనే ఇరాన్‌లో కూడా తమ పాత్ర ఉండాల్సిందేనని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక ఇరాన్ కొత్త లీడర్‌ను కూడా చంపేస్తామని ఇజ్రాయెల్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Exit mobile version