పూణె యువ వ్యాపారవేత్త కేతన్ హత్య కేసులో తవ్వేకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి సియా గోయల్ చేసిన కుట్రను ఖాకీలు ఛేదిస్తున్నారు. హత్యకు ముందు ఇద్దరూ కలిసి కేఫ్లో గంటపాటు మర్డర్ ప్లాన్ గీసినట్లుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను బట్టి కనిపెట్టారు.
ఇక ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పటి నుంచి చిగురించిందన్న దానిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. గతేడాది దీపావళి సందర్భంగా ఒక పార్టీలో సియా-చేతన్ కలుసుకున్నట్లుగా కనిపెట్టారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. క్రమక్రమంగా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక సియా బేకరీ నిర్వహిస్తుండగా.. చేతన్కు డ్రై ఫ్రూట్స్ షాపు ఉంది. ఇలా ఇద్దరి మధ్య బంధం బలపడి.. షికార్లతో ఎంజాయ్ చేస్తూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ విషయం తెలియని పెద్దలు కేతన్-సియాను ఒక్కటి చేయాలనున్నారు.
అయితే కేతన్-సియా ఫ్యామిలీల మధ్య రెండు దశాబ్దాల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ పెళ్లి వేడుకలో రెండు కుటుంబాలు కలిశాయి. దీంతో కేతన్ అగర్వాల్-సియా గోయల్కు పెళ్లి చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకున్నాయి. ఫిబ్రవరిలో నిశ్చితార్థం కూడా చేశారు. ఓ వైపు కేతన్తో ఉంటూనే.. ఇంకోవైపు చేతన్తో సియా ప్రేమ వ్యవహారం నడిపిస్తోంది. ఎక్కువ సార్లు సియా ఫోన్ బిజీ వస్తూ ఉండేది. కేతన్కు అనుమానం వచ్చినా.. లైట్ తీసుకున్నాడు. ఇక నవంబర్లో గ్రాండ్లో ఉధయ్పూర్లో పెళ్లి జరపాలని ప్యాలెస్ను రూ. 17 కోట్లకు బుక్ చేశారు. అలాగే రెండు విమానాలు కూడా కేతన్ కుటుంబం బుక్ చేసింది. కానీ సియా మాత్రం ఎలాగైనా కేతన్ వదిలించుకోవాలని ప్రియుడితో కలిసి పన్నాగం పన్నింది. ఈ క్రమంలోనే జూన్ 14న కేతన్ కోటపై నుంచి కిందకు తోసేసింది. అయితే అదృష్టం కొద్ది కేతన్ బతికిపోయాడు. తిరిగి జూన్ 17న కేఫ్లో చేతన్తో కలిసి కుట్ర పన్ని.. అనుకున్న ప్రణాళిక ప్రకారం కేతన్ను చారిత్రాత్మక కోటకు రప్పించి జూన్ 18న కిందకు తోసేసింది. తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం కేతన్ పడిపోయాడని పోలీసులకు, కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది.
అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సియాను విచారించినప్పుడు తికతిక సమాధానాలు ఇవ్వడంతో ఏదో జరిగిందని పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే కేతన్ కుటుంబ సభ్యులు మాత్రం.. ఇక్కడితో వదిలిపెట్టేయండని చెప్పుకొచ్చారు. కానీ పోలీసులు మాత్రం సీరియస్గా తీసుకుని సీసీటీవీలను పరిశీలించగా.. సియా వెనుక నుంచి ప్రియుడికి సైగలు చేసిన దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసుల అనుమానమే నిజమైంది. తీగలాగితే డొంకంతా కదిలినట్లుగా.. మొత్తం సియా కుట్ర కోణాన్ని పోలీసులు బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తానికి ఈ కేసులో అమాయకుడైన కేతన్ ప్రాణాలు పోవడం నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

