Justin Greaves: వెస్టిండీస్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో మూడో రోజు వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్ అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ 311 పరుగులు చేయగా.. పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న పాకిస్థాన్ను జస్టిన్ గ్రీవ్స్ తన చారిత్రాత్మక స్పెల్తో కుప్పకూల్చాడు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 3 వికెట్ల నష్టానికి 199 పరుగులతో మంచి స్థితిలోనే ఉంది. ఇక మూడో రోజు ఆట ప్రారంభమైన తర్వాత కూడా స్కోరును 3 వికెట్లకు 244 పరుగులకు చేర్చింది. దీంతో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో మంచి ఆధిక్యం సాధించడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్ తన అద్భుతమైన బౌలింగ్తో మ్యాచ్ను పూర్తిగా వారి వైపు తిప్పేశాడు.
తన తొలి 6 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన గ్రీవ్స్.. ఆ తర్వాత వేసిన వరుస 5 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 5 వికెట్లు పడగొట్టాడు. ప్రతి ఓవర్లో ఒక్కో వికెట్ తీస్తూ.. వరుసగా 5 మెయిడెన్ ఓవర్లు నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 5 వికెట్లు తీసే క్రమంలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా జస్టిన్ గ్రీవ్స్ చరిత్ర సృష్టించాడు.
ఈ అద్భుతమైన స్పెల్లో పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్, మహ్మద్ రిజ్వాన్, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, మహ్మద్ అబ్బాస్లను గ్రీవ్స్ పెవిలియన్కు పంపించాడు. 32 ఏళ్ల జస్టిన్ గ్రీవ్స్ టెస్ట్ కెరీర్లో ఇదే తొలి ఐదు వికెట్ల ప్రదర్శన కూడా. గ్రీవ్స్ బౌలింగ్తో వెస్టిండీస్ పాకిస్థాన్ను తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించకుండా నిలువరించడమే కాకుండా మ్యాచ్పై గట్టి పట్టు సాధించింది.
అలాగే మరోవైపు వెస్టిండీస్ బౌలర్లలో కెమార్ రోచ్ 15.1 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే షమార్ జోసెఫ్ 16 ఓవర్లలో 58 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకోగా, జేడెన్ సీల్స్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్లలో కెప్టెన్ షాన్ మసూద్ ఒక్కడే శతకంతో పోరాడాడు. అతడు 109 పరుగులు చేసి జట్టుకు అండగా నిలవగా.. ఇమామ్ ఉల్ హక్ 63 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మిగతా బ్యాటర్లు జస్టిన్ గ్రీవ్స్ బౌలింగ్ అటాక్ కు తట్టుకోలేక వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 282 పరుగులకే పరిమితమైంది.
రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వెస్టిండీస్ పాక్ బౌలర్ల దెబ్బకు చేతులు ఎత్తేసింది. మొదటి ఇన్నింగ్స్ లో 29 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టగా.. మూడోరోజు ఆట ముగిసే సమయానికి 126 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిందింది. దీనితో ప్రస్తుతం వెస్టిండీస్ 155 పరుగుల లీడ్ తో కొనసాగుతుంది.

