దివంగత అమెరికా వ్యాపారవేత్త, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ నెట్వర్క్పై ఫ్రాన్స్లో జరుగుతున్న విచారణలో ఒక కీలకమైన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మరో పది మంది కొత్త బాధితులు తాజాగా తమ గళాన్ని విప్పారని పారిస్ ప్రాసిక్యూటర్ ఆదివారం ప్రకటించారు.
అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ ఏడాది జనవరిలో ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన కీలక పత్రాలను విడుదల చేసింది. ఆ పత్రాల ఆధారంగా ఫ్రాన్స్ ప్రభుత్వం మానవ అక్రమ రవాణాపై విచారణను ప్రారంభించింది. మైనర్ బాలికలను లైంగిక వేధింపుల కోసం రవాణా చేసిన ఆరోపణలపై ఎప్స్టీన్ 2019లో జైలులో ఉండగానే మరణించాడు. అయితే.. ఫ్రాన్స్లో ఎప్స్టీన్కు సహకరించిన వారు ఎవరు? అక్కడ జరిగిన నేరాలు ఏమిటి? అనే కోణంలో ఫ్రెంచ్ అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.
పారిస్ టాప్ ప్రాసిక్యూటర్ లారే బెక్వా మాట్లాడుతూ.. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలని తాము ఫిబ్రవరిలో కోరినట్లు తెలిపారు. ఆ తర్వాత సుమారు 20 మంది బాధితులు తమను సంప్రదించారని ఆమె చెప్పారు. వారిలో కొందరు ఇప్పటికే దర్యాప్తు అధికారులకు తెలిసినవారే అయినప్పటికీ, మిగిలిన పది మంది మాత్రం పూర్తిగా కొత్తవారని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఈ బాధితులందరి స్టేట్మెంట్లను రికార్డ్ చేయడమే తమ మొదటి ప్రాధాన్యత అని బెక్వా పేర్కొన్నారు. వీరిలో కొందరు విదేశాలలో ఉన్నందున, వారు పారిస్ రావడానికి వీలుగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
దీనితో పాటు.. ఎప్స్టీన్కు సంబంధించిన పాత ఫైళ్లు, కంప్యూటర్లు, ఫోన్ రికార్డులు, అడ్రస్ బుక్లను అధికారులు మళ్లీ పరిశీలిస్తున్నారు. బాధితులు చెప్పే పేర్లతో వీటికి ఏమైనా సంబంధం ఉందా అని చూస్తున్నారు. అవసరమైతే అంతర్జాతీయ సహాయం కూడా తీసుకోనున్నారు. 2019లో ఎప్స్టీన్ మరణించిన తర్వాత పారిస్లోని అతని లగ్జరీ అపార్ట్మెంట్లో సోదాలు జరిగాయి. ఫ్రాన్స్లో కూడా అతను యువతులను వేధించాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే… ఈ కేసులో అనుమానితులుగా ఉన్న ఎవరినీ అధికారులు ఇంకా ప్రశ్నించలేదు. ఎప్స్టీన్కు గతంలోనే 2008లో ఒక మైనర్ బాలికను వ్యభిచారంలోకి దించినందుకు శిక్ష పడింది, అప్పట్లో అతను 13 నెలలు జైలులో గడిపాడు.
