జపాన్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ (JMA) వెల్లడించిన వివరాల ప్రకారం, కుమామోటో (Kumamoto) ప్రిఫెక్చర్లో రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం అనంతరం గరిష్టంగా ఒక మీటర్ (3.28 అడుగులు) ఎత్తు వరకు సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
పలు ప్రిఫెక్చర్లకు అత్యవసర హెచ్చరికలు
భూకంపం నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం కుమామోటో, నాగసాకి, కగోషిమా, ఫుకుఓకా, సాగ, ఓయిటా, మియాజాకి ప్రిఫెక్చర్లలో అత్యవసర భూకంప హెచ్చరికలు జారీ చేసింది. ఇవన్నీ జపాన్ దక్షిణ భాగంలోని క్యూషూ (Kyushu) ద్వీపంలో ఉన్నాయి. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలు అధికారిక సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఇదిలా ఉండగా, అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ (PTWC) ఈ భూకంపం కారణంగా హవాయి, అమెరికన్ సమోవా ప్రాంతాలకు సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది.
అప్రమత్తంగా ఉండాలని సూచన
భూకంపం తర్వాత ఆఫ్టర్షాక్స్ వచ్చే అవకాశం ఉండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ అధికారులు సూచించారు. ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు వెల్లడికాలేదు. పరిస్థితిపై అధికారులు నిరంతరం నిఘా ఉంచి, అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

