Site icon NTV Telugu

Iran-Israel War Impact on India: ఇరాన్-ఇజ్రాయెల్ వార్‌.. బంగారం, వెండి, చమురు సహా ఈ రంగాలపై భారత్‌లో గందరగోళం..!

Iran Israel War Impact On I

Iran Israel War Impact On I

Iran-Israel War Impact on India: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణలు పెరుగుతుండగా.. అమెరికా కూడా ఈ పరిణామాల్లో భాగం కావడంతో యుద్ధ వాతావరణం మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలో ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌కు చెందిన పలు సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించాయని సమాచారం. అనంతరం ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యంలోని కొన్ని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా మారినట్లు వార్తలు వెలువడుతున్నాయి.

దుబాయ్‌, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, అబుధాబి, బహ్రెయిన్ ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలకు దారితీశాయి. ఇదే సమయంలో.. భారత్‌ మార్కెట్‌పై కూడా ఇదీ తీవ్ర ప్రభావం చూపనుంది.. చమురు, బంగారం, వెండి, భారతీయ స్టాక్‌ మార్కెట్లను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుందనే హెచ్చరికలు ఉన్నాయి..

చమురు ధరలపై ప్రభావం
ఈ యుద్ధ పరిస్థితుల వల్ల ముడి చమురు సరఫరా అంతరాయం కలగవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన Strait of Hormuz ప్రాంతంలో ఉద్రిక్తత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ తన అవసరాల్లో ఎక్కువ భాగం ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఈ ప్రాంతంలో అంతరాయం ఏర్పడితే చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.

స్టాక్ మార్కెట్‌లో ఆందోళన
యుద్ధ వార్తలతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ కూడా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్ అనిశ్చితి కారణంగా సూచీలు క్షీణించిన సందర్భాలు ఉన్నాయి. యుద్ధం మరింత తీవ్రమైతే పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మళ్లే అవకాశముంది. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

బంగారం, వెండి ధరలు పెరుగుతాయా?
ప్రపంచవ్యాప్తంగా యుద్ధం లేదా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తుల వైపు మళ్లుతారు. దీంతో ఈ లోహాల ధరలు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం దేశీయ కమోడిటీ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇప్పటికే ఉన్నత స్థాయిలో ఉన్నాయి. యుద్ధ పరిస్థితులు కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారత్‌పై ప్రభావం
ఈ యుద్ధ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే భారత్‌లో.. చమురు ధరలు పెరగడం, పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.. ద్రవ్యోల్బణం పెరగడం, స్టాక్ మార్కెట్‌లో అస్థిరత.. బంగారం, వెండి ధరల పెరుగుదల వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అయితే పరిస్థితులు ఎంతవరకు తీవ్రమవుతాయన్నది అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ దేశాల మధ్య దౌత్య చర్చలు విజయవంతమైతే ఉద్రిక్తతలు తగ్గే అవకాశమూ ఉంది. ప్రస్తుతం పెట్టుబడిదారులు మరియు వ్యాపార వర్గాలు అప్రమత్తంగా పరిస్థితులను గమనిస్తున్నాయి.

Exit mobile version