India Qualifies Olympics: 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్.. అర్హత సాధించిన భారత మహిళలు.!

India Qualifies Olympics

India Qualifies Olympics

India Qualifies Olympics: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 2028లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అర్హతను భారత మహిళల క్రికెట్ జట్టు ఖరారు చేసుకుంది. క్రికెట్ ఒలింపిక్స్‌లో 128 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రవేశిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సంయుక్తంగా అర్హత సాధన విధానాన్ని ప్రకటించాయి.

లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో తలా 6 జట్లు పోటీపడనున్నాయి. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఓషియానియా ఖండాలకు కనీసం ఒక్కో జట్టుకు ప్రాతినిధ్యం కల్పించేలా క్వాలిఫికేషన్ విధానాన్ని రూపొందించారు. మహిళల విభాగంలో భారత్, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ (ఇంగ్లండ్ ద్వారా), దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటికే ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. 2026 మహిళల టీ20 ప్రపంచకప్ ఫలితాల ఆధారంగా ఆయా ఖండాల నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లకు ఒలింపిక్ బెర్త్‌లు లభించాయి. దీంతో భారత మహిళల జట్టు అధికారికంగా లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకుంది.

పురుషుల విభాగంలో క్వాలిఫికేషన్ ప్రక్రియ భిన్నంగా ఉండనుంది. 2026 డిసెంబర్ 31 నాటికి ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో ఉన్న అత్యుత్తమ అర్హత కలిగిన నాలుగు జట్లు, వేర్వేరు ఖండాలకు ప్రాతినిధ్యం వహించే జాతీయ ఒలింపిక్ కమిటీల ఆధారంగా ఎంపిక చేయబడతాయి. అమెరికా ఆతిథ్య దేశంగా ఉండటంతో పురుషుల, మహిళల విభాగాల్లో ఐదో స్థానం దక్కే అవకాశం ఉంది. అయితే 2026 జూన్ 30 నుంచి డిసెంబర్ 31 మధ్యకాలంలో అమెరికా జట్టు టాప్-15 ర్యాంకింగ్స్‌లో ఉండాలి. ఆ అర్హత సాధించలేకపోతే, తదుపరి అర్హత కలిగిన జట్టుకు అవకాశం కల్పిస్తారు.

మరోవైపు, ఆరో స్థానాన్ని నిర్ణయించేందుకు ఐసీసీ చరిత్రలో తొలిసారిగా ‘ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫయర్’ టోర్నీ నిర్వహించనుంది. 2027లో జరగనున్న ఈ టోర్నీలో పురుషుల, మహిళల విభాగాల్లో తలా ఎనిమిది జట్లు పాల్గొంటాయి. వీటిలో విజేతగా నిలిచే ఒక్క జట్టుకు మాత్రమే ఒలింపిక్ బెర్త్ లభిస్తుంది. ఇదిలా ఉండగా.. వెస్టిండీస్‌కు ప్రత్యేక అర్హత విధానాన్ని ఐసీసీ ప్రకటించింది. వెస్టిండీస్ అనేది పలు కరీబియన్ దేశాల సమ్మిళిత జట్టు కావడంతో ఐఓసీ గుర్తించిన ఒకే జాతీయ ఒలింపిక్ కమిటీగా పరిగణించబడదు. అందువల్ల నేరుగా ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత వారికి లేదు. అయితే క్వాలిఫికేషన్‌కు సమీపంగా నిలిస్తే, కరీబియన్ ప్రాంత దేశాల మధ్య ప్రత్యేక అర్హత టోర్నీ నిర్వహించి, అందులో విజేతగా నిలిచిన దేశానికి ఐసీసీ ఒలింపిక్స్ క్వాలిఫయర్‌లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.