Vikram-1 Launch Success: భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో శనివారం ఒక సరికొత్త చరిత్ర లిఖించబడింది. ప్రైవేట్ రంగంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన దేశపు మొట్టమొదటి ఆర్బిటల్-క్లాస్ రాకెట్ ‘విక్రమ్-1’ (Vikram-1) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC-SHAR) నుంచి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రాత్మక ప్రయోగానికి ‘మిషన్ ఆగమన్’ (Mission Aagaman) అని పేరు పెట్టారు. ఈ విజయంతో వాణిజ్యపరంగా సొంతంగా రాకెట్లను తయారు చేసి కక్ష్యలోకి పంపగల సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని కొన్ని ఎంపిక చేసిన దేశాల సరసన భారతదేశం నిలిచింది.
నిప్పులు చిమ్ముతూ విక్రమ్-1 రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్తున్న దృశ్యం, గత కొన్నేళ్లుగా మన ఇంజనీర్లు పడ్డ కష్టానికి, వారి నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది. ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు చిన్న అంతర్గత సాంకేతిక కారణం (Internal Hold) వల్ల కొంత సమయం ఆలస్యమైనప్పటికీ, ఆ తర్వాత రాకెట్లోని అన్ని దశలు అనుకున్నట్లుగా, అత్యంత ఖచ్చితత్వంతో పనిచేశాయి. సుమారు ఏడు అంతస్తుల ఎత్తు ఉండే ఈ విక్రమ్-1 రాకెట్ను పూర్తిగా తేలికపాటి కార్బన్ కంపోజిట్ మెటీరియల్తో తయారు చేశారు. ఇది భూమికి దగ్గరగా ఉండే దిగువ కక్ష్యలోకి (Low Earth Orbit) దాదాపు 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లగలదు. ఈ రాకెట్ ఇంజన్లను సరికొత్త 3D-ప్రింటింగ్ టెక్నాలజీతో, పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించడం విశేషం.
ఈ తొలి ప్రయోగంలో భాగంగా గృహా స్పేస్ (Grahaa Space), కాస్మోసెర్వ్ (Cosmoserve), డి-క్యూబ్డ్ (DCubed) వంటి సంస్థలకు చెందిన సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహాలతో పాటు, స్కైరూట్ సంస్థకు చెందిన ‘స్కోప్’ (SCOPE) అనే ఎక్స్పెరిమెంట్ను కూడా అంతరిక్షంలోకి పంపారు. సాంకేతిక పరికరాలతో పాటు ఎంతో ప్రత్యేకమైన భావోద్వేగ వస్తువులను కూడా ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు. వాటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వహస్తాలతో రాసిన వందేమాతరం పోస్ట్కార్డ్తో పాటు, ఇస్రో ప్రస్తుత, మాజీ ఛైర్మన్లు, భారతీయ వ్యోమగాములు, ఇన్వెస్టర్లు పంపిన రాతపూర్వక సందేశాలు ఉన్నాయి. ఈ ప్రయోగం ద్వారా లభించే కీలకమైన ఇంజనీరింగ్ డేటా ఆధారంగా స్కైరూట్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని వాణిజ్య ప్రయోగాలను మరింత వేగంగా చేయగలుగుతుంది.
మన దేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు ఈ విజయం ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇస్రోకు చెందిన మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా కలిసి 2018లో ఈ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) సంస్థను స్థాపించారు. చిన్న ఉపగ్రహాల మార్కెట్లో తక్కువ ఖర్చుతో, నమ్మకమైన సేవలను అందించాలనే లక్ష్యంతో వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతకుముందు 2022లో వీరు ప్రయోగించిన ‘విక్రమ్-ఎస్’ (Vikram-S) దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సబ్-ఆర్బిటల్ రాకెట్గా రికార్డు సృష్టించగా, ఇప్పుడు ‘విక్రమ్-1’తో ప్రైవేట్ ఆర్బిటల్ ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసి భారత కీర్తిపతాకాన్ని విశ్వవీధిలో ఎగురవేశారు.

