NTV Telugu Site icon

Virat Kohli: కోహ్లీకి మద్దతుగా నిలిచిన గౌతమ్ గంభీర్‌!

Virat Kohli Test

Virat Kohli Test

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ తిరిగి పుంజుకుంటాడని టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్ ప్రపంచ స్థాయి క్రికెటర్‌ అని, అరగేంట్రం చేసినప్పుడు ఉన్న పరుగుల దాహం అతడిలో ఇప్పటికీ ఉందన్నాడు. కివీస్‌, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌ల్లో కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని గంభీర్‌ పేర్కొన్నాడు. 2024లో మూడు టెస్టులు ఆడిన విరాట్.. 50 ప్లస్ స్కోర్ సాధించలేకపోయాడు. దీంతో అతడి ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీకి గౌతీ మద్దతుగా నిలిచాడు.

తాజాగా గౌతమ్‌ గంభీర్‌ మాట్లాడుతూ… ‘విరాట్ కోహ్లీ పట్ల నా ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయి. అతడు ప్రపంచ స్థాయి క్రికెటర్‌. సుదీర్ఘకాలం గొప్పగా రాణించిన ప్లేయర్. అరగేంట్రం చేసినప్పుడు ఉన్న పరుగుల దాహం.. అతడిలో ఇప్పటికీ ఉంది. శ్రీలంకపై అరగేంట్రం చేసినప్పుడు కోహ్లీతో కలిసి బ్యాటింగ్‌ చేయడం నాకు గుర్తింది. అతడిలో పరుగుల దాహం ఎప్పటికీ ఉంటుంది. వచ్చే సిరీస్‌ల్లో భారీగా పరుగులు సాధించాలనే ఆకలితో ఉంటాడు. అదే అతన్ని ప్రపంచ స్థాయి క్రికెటర్‌గా చేసింది. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌ల్లో విరాట్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడు. ఒకసారి ఫామ్ అందుకుంటే స్థిరంగా రన్స్ చేయగలడని మాకు తెలుసు’ అని చెప్పాడు.

Also Read: Jio New Recharge Plans: జియో కొత్త ప్లాన్స్.. ఇక వారికి పండగే!

అక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో భారత్‌ మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్టు బెంగళూరులో జరగనుంది. పూణే, ముంబైలలో 2, 3 టెస్టులు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్‌లో భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్‌పై విరాట్‌కు మంచి రికార్డు ఉంది. కివీస్‌తో జరిగిన 11 టెస్టుల్లో (21 ఇన్నింగ్స్‌ల్లో) 45.57 సగటుతో 866 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ అత్యుత్తమ స్కోరు 211.