Yashasvi Jaiswal: య‌శ‌స్వీ డ‌బుల్ సెంచరీ.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్! ఇంగ్లండ్ లక్ష్యం 557 పరుగులు

Yashasvi Jaiswal Double Hundred

Yashasvi Jaiswal Double Hundred

India declare after Yashasvi Jaiswal slams double century: రాజ్‌కోట్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 430/4 వ‌ద్ద‌ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దాంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్‌కు 557 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ (214 నాటౌట్; 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స‌ర్లు) డబుల్ సెంచ‌రీ బాదాడు. మరోవైపు అరంగేట్ర ఆటగాడు స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ (68 నాటౌట్; 78 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ సాధించాడు. శుభ్‌మ‌న్ గిల్ (91) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లీష్ బౌలర్లలో రూట్, రెహాన్‌, హార్ట్‌లీ తలో వికెట్‌ తీశారు.

నాలుగో రోజైన ఆదివారం ఓవర్ నైట్ స్కోర్ 196/2తో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంబించింది. శుభమన్‌ గిల్‌ సహా కుల్దీప్ యాదవ్‌ కూడా బౌండరీలు బాదాడు. అయితే నిలకడగా ఆడుతున్న గిల్‌ (91) అనూహ్యంగా రనౌటయ్యాడు. బ్యాటింగ్‌ చేస్తున్న కుల్దీప్ పరుగుకోసం పిలిచి వెనక్కి వెళ్లాడు. అప్పటికే సంగం దూరం పరుగెత్తిన గిల్‌.. రనౌటయ్యాడు. ఆపై క్రీజులోకి వచ్చిన య‌శ‌స్వీ జైస్వాల్ దూకుడుగా ఆడాడు. రెహాన్‌ బౌలింగ్‌లో కుల్దీప్ (27) స్లిప్‌లో రూట్‌కి చిక్కి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్ చెలరేగాడు. య‌శ‌స్వీ, సర్ఫరాజ్‌ బౌండరీలతో చెలరేగడంతో భారత్ స్కోర్ పరుగులు పెట్టింది. ఈ క్రమంలో సర్ఫరాజ్‌ హాఫ్ సెంచరీ చేయగా.. య‌శ‌స్వీ డబుల్ సెంచరీ బాదాడు. ఆపై భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

557 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. ఓపెనర్లు జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు. ఆచితూచి ఆడుతున్న బెన్‌ డకెట్‌ (4) రనౌట్‌ అయ్యాడు. వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ అద్భుతమైన రనౌట్‌ చేశాడు. దాంతో 15 పరుగులకే ఇంగ్లండ్ తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 18 రన్స్ చేసింది. క్రీజ్‌లో జాక్‌ క్రాలే (11), ఒలీ పోప్‌ (2) ఉన్నారు. విజయానికి ఇంకా ఇంగ్లండ్ 539 రన్స్ చేయాల్సి ఉంది.