బాలీవుడ్లో ప్రేమకథలను భావోద్వేగంతో చెప్పడంలో దర్శకుడు ఇంతియాజ్ అలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆయన సినిమాల్లో సంగీతం కూడా కథతో సమానంగా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అందుకే సంగీత మాంత్రికుడు A. R. రహ్మాన్ అలాగే లిరిసిస్ట్ ఇర్షద్ కామిల్ తో కలిసి చేసిన సినిమాలు బాలీవుడ్లో మ్యూజికల్ క్లాసిక్స్గా నిలిచాయి. ఇప్పుడు ఈ ముగ్గురి క్రియేటివ్ కాంబినేషన్ మరోసారి మై వాపస్ ఆవూంగా అనే రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. దాంతో గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన కొన్ని గుర్తుండిపోయే సినిమాలపై చర్చ హాట్ టాపిక్ అవుతోంది.
ఇంతియాజ్ అలీ , ఏఆర్ రహ్మాన్ , ఇర్షాద్ కామిల్ కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో మొదట గుర్తుకు వచ్చేది రాక్ స్టార్. ఈ సినిమాలో రణబీర్ కపూర్ నటనతో పాటు… “నాదాన్ పరిందే”, “కున్ ఫయా కున్” లాంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మ్యూజిక్ ఇప్పటికీ బాలీవుడ్లో ఒక కల్ట్ క్లాసిక్గా భావిస్తారు. సంగీతం ద్వారా ఒక ఆర్టిస్ట్ భావోద్వేగాలను చూపించిన ఈ చిత్రం ఈ ముగ్గురి కాంబినేషన్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఈ కాంబినేషన్లో మరో గుర్తుండిపోయే సినిమా తమాషా. ఇందులో కూడా రణబీర్ కపూర్ తో పాటు దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించారు. “అగర్ తుమ్ సాథ్ హో”, “మటార్గష్టి” లాంటి పాటలు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ప్రేమ, వ్యక్తిత్వం, జీవితాన్ని గురించి చెప్పిన ఈ సినిమా… మ్యూజిక్ అండ్ లిరిక్స్ తో మరింత గుర్తుండిపోయేలా మారింది.
ఇప్పుడు ఇదే క్రియేటివ్ టీమ్ మరోసారి మై వాపస్ ఆఊంగా అనే కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ గాయకుడు-నటుడు దిల్జీత్ దొసాంజ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, షార్వరీ వా, వేదాంత్ రైనాతో పాటు సీనియర్ నటుడు నజీరుద్దీన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారత విభజన తర్వాత జరిగిన వలసలు, జ్ఞాపకాలు ఆ కాలం దాటినా మాయంకాని ప్రేమకథ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. 2026 జూన్ 12న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా… మరోసారి ఈ ముగ్గురు కలిసి మ్యూజికల్ మ్యాజిక్ సృష్టిస్తారా అనే ఆసక్తిని పెంచుతోంది.
