దేశవ్యాప్తంగా మరోసారి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన ఐదు సైక్లోనిక్ సర్క్యులేషన్లు (వాయుగుండాలు) కలిసి రుతుపవనాలకు బలం చేకూరుస్తున్నాయని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన INSAT-3DR, INSAT-3DS ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. ఈ వ్యవస్థల ప్రభావంతో ఢిల్లీతో పాటు ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలో మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
జూలై 22 ఉదయం ఇస్రో ఉపగ్రహాలు సేకరించిన చిత్రాలను భారత వాతావరణ శాఖ విశ్లేషించింది. ప్రస్తుతం హర్యానా, ఈశాన్య మధ్యప్రదేశ్, నైరుతి రాజస్థాన్, ఉత్తర ఛత్తీస్గఢ్, పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఐదు సైక్లోనిక్ సర్క్యులేషన్లు ఉన్నట్లు గుర్తించింది. అదే సమయంలో బంగాళాఖాతంలోని వాయుగుండాన్ని ఈశాన్య అరేబియా సముద్రంతో అనుసంధానించే రుతుపవనాల అల్పపీడన ద్రోణి కూడా చురుగ్గా కొనసాగుతోంది. దీంతో రెండు సముద్రాల నుంచి భారీగా తేమగాలులు దేశంలోకి ప్రవేశించి వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
సైక్లోనిక్ సర్క్యులేషన్ అంటే..?
సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది అల్పపీడన ప్రాంతం చుట్టూ ఏర్పడే గాలి సుడిగుండం. ఉత్తరార్ధగోళంలో ఇవి అపసవ్య దిశలో తిరుగుతాయి. తుఫానులంత శక్తివంతంగా కాకపోయినా.. సముద్రాల నుంచి తేమగాలులను ఆకర్షించి వాటిని పైకి లేపి మేఘాలుగా మారుస్తాయి. ఈ ప్రక్రియ వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.
INSAT-3DR ఇన్ఫ్రారెడ్ చిత్రాల్లో బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ ప్రాంతాల్లో అత్యంత ఎత్తైన వర్ష మేఘాలు స్పష్టంగా కనిపించాయి. ఈ ప్రాంతాల్లో Cloud Top Brightness Temperature (CTBT) విలువలు మైనస్ 50 నుంచి మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. ఇవి తీవ్ర ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు సంకేతంగా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల వైపు అరేబియా సముద్రం నుంచి కూడా భారీ మేఘాలు కదులుతున్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. అయితే ఒమన్, సోమాలియా వైపు సముద్ర ప్రాంతం మాత్రం పొడిగా ఉన్నట్లు గుర్తించారు. జూలై మొదటి పది రోజుల పాటు రుతుపవనాల ద్రోణి హిమాలయాల వైపు ఉండటంతో ఢిల్లీ, ఉత్తర భారతదేశంలో వర్షాలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఆ ద్రోణి మళ్లీ మైదాన ప్రాంతాల వైపు రావడంతో ఢిల్లీ, హర్యానా, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి.
ఎల్నినో ప్రభావం తగ్గిందా?
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం రుతుపవనాలపై ఉంటుందనే అంచనాలు ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఏర్పడిన ఈ ఐదు సైక్లోనిక్ సర్క్యులేషన్లు, రుతుపవనాల ద్రోణి కలిసి స్థానికంగా బలమైన వర్ష పరిస్థితులను సృష్టిస్తున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. సీజన్ మొత్తంపై ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ.. ఇలాంటి స్వల్పకాలిక వాతావరణ వ్యవస్థలు కొన్ని రోజుల పాటు భారీ వర్షాలను కురిపించగలవని వివరించారు.
భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. మరో 4 నుంచి 5 రోజుల పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగనున్నాయి. ముఖ్యంగా కొంకణ్-గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీటిమునిగే పరిస్థితులు, రవాణా అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

