Hyderabad: స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతులు.. రూ.50 కోట్ల మోసం ఆరోపణలతో కొత్త ట్విస్ట్.!

Hyd Missing

Hyd Missing

Hyderabad: హైదరాబాద్‌లోని చెర్లపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు చెప్పి అదృశ్యమైన దంపతుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. తొలుత మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ ఘటనలో తాజాగా భారీ ఆర్థిక మోసం ఆరోపణలు వెలుగులోకి రావడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. పబ్బా చంద్రశేఖర్ (51), ఆయన భార్య పబ్బా స్వప్న (42) జూన్ 22న స్విట్జర్లాండ్‌కు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. అయితే ఆ తర్వాత జూలై 8 వరకు వారు కుటుంబ సభ్యులను ఫోన్ లేదా ఇతర మార్గాల్లో సంప్రదించలేదు. ఇద్దరి మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో అనుమానం వ్యక్తం చేసిన వారి కుమార్తె పబ్బా శ్రేయ చెర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దంపతుల ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు.

రూ.50 కోట్ల మోసం ఆరోపణలు:

ఈ కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితమే పబ్బా చంద్రశేఖర్ దంపతులపై పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎక్కువ వడ్డీ ఇస్తామని, వివిధ పెట్టుబడి పథకాల పేరుతో డబ్బులు పెట్టిస్తామని చెప్పి సుమారు రూ.50 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించిన అనంతరం పబ్బా చంద్రశేఖర్ దంపతులు స్విట్జర్లాండ్‌కు వెళ్లి అక్కడే తలదాచుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మిస్సింగ్‌గా కనిపిస్తున్న ఈ ఘటన వెనుక ఆర్థిక నేరం కోణం కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు:

దంపతులు నిజంగా స్విట్జర్లాండ్‌కు వెళ్లారా.? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు.? వారు దేశం విడిచి వెళ్లడానికి ముందు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి.? అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే మోసం ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తూ.. ఈ రెండు కేసుల మధ్య సంబంధం ఉందా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు దంపతుల ప్రయాణ వివరాలు, బ్యాంకు లావాదేవీలు, బాధితుల ఫిర్యాదులు, విదేశీ ప్రయాణ రికార్డులను పరిశీలిస్తూ కేసును ఛేదించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైదరాబాద్‌లో సంచలనంగా మారింది.