NTV Telugu Site icon

వణికిస్తున్న భారీ వర్షాలు : 33 మంది మృతి

ఢిల్లీ నుంచి ముంబై దాకా.. నార్త్‌ ఇండియాలో నాన్‌ స్టాప్‌ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీలో ఎడతెరిపిలేని వానలకు.. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఆ ప్రవాహాల్లోనే కష్టంగా ప్రయాణాలు చేస్తున్నారు రాజధానివాసులు. ఆర్థిక రాజధాని ముంబైనీ వానలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచి.. రహదారులు వాగులను తలపిస్తున్నాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముంబయి, థానె, పాల్ఘర్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొన్ని గంటలుగా ముంబయిలోని చాలా ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వానల కారణంగా జరిగిన పలు సంఘటనల్లో.. ఇప్పటివరకూ 33 మంది చనిపోయారు. మరికొందరు గాయాలపాలయ్యారు.

ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఆదివారం నుంచి కురుస్తోన్న వానలతో ముంబై నగరం తడిసి ముద్దవుతోంది. ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని నగరవాసులకు సూచించింది బీఎంసీ. ముంబయి, థానె, పాల్ఘర్, రాయ్‌గఢ్‌లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేసింది. ఇవాళ కూడా వానలు తెరిపినిచ్చే సూచనలు కనిపించడం లేదని వాతావరణ శాఖ తెలిపింది.

ఒక్క మహారాష్ట్రలోనేకాదు, నార్త్‌ స్టేట్స్‌లో చాలా వరకు వానలు దంచి కొడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలకు గోడకూలి..ఏడుగురు చనిపోయారు. భారీ వర్షాలకు ఇండ్లు దెబ్బతినడంతో ఈ ప్రమాదాలు జరిగట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్‌లోని చంపావత్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, తనక్‌పూర్‌ రోడ్డుపై.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండచరియలు విరిగిపడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో.. ప్రాణనష్టం తప్పింది.

ఉత్తర భారతానికి వాన ముప్పు ఇంకా పోలేదని… వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో మోస్తరుగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.