హుజురాబాద్‌ ఫలితం రెఫరెండం కాదు: కొప్పుల ఈశ్వర్‌

తెలంగాణలోని హుజురాబాద్‌ బైపోల్‌ మినీయుద్ధాన్నే తలపించింది. ఈ హోరాహోరి పోరులో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. ఈ నెల రెండున హుజురాబాద్‌ ఫలితం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా రావడంతో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఈ ఎన్నికకు అసలు ప్రాధాన్యతే లేదని వ్యాఖ్యనించారు. ఇదిలా ఉంటే తాజాగా టీఆర్‌ఎస్ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హుజురాబాద్‌ ఫలితాన్ని రెఫరెండంగా భావించడం లేదన్నారు.

ఈ 20 ఏళ్లలో టీఆర్‌ఎస్‌ ఎన్నో గెలుపు ఓటములను చూసిందని చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని… మా ఓట్లు మాకే వచ్చాయని ఆయన తెలిపారు. హుజురాబాద్‌ ప్రజలు సంక్షేమాన్ని చూసి ఓటేయలేదని, కేవలం ఈటలపై ఉన్న వ్యక్తిగత అభిమానంతో ఓట్లు వేశారన్నారు. టీఆర్‌ఎస్‌ ఆ నియోజకవర్గంలో ఓడినా దళిత బంధును ఆపబోమని ఆయన స్పష్టం చేశారు.