Harmanpreet Kaur History: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా నిలిచి ఆమె కొత్త చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్కు ముందు హర్మన్ప్రీత్ కౌర్ ఖాతాలో 726 పరుగులు ఉండగా.. రికార్డును అందుకోవడానికి కేవలం ఒక పరుగు మాత్రమే అవసరమైంది. ఇక ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ లో నాలుగో ఓవర్లో మొదటి పరుగు సాధించిన హర్మన్ప్రీత్.. మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉన్న 726 పరుగుల రికార్డును అధిగమించింది. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది.
టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు:
హర్మన్ప్రీత్ కౌర్ – 762* పరుగులు
మిథాలీ రాజ్ – 726 పరుగులు
స్మృతి మంధాన – 534* పరుగులు
ఇదిలా ఉండగా.. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ షెఫాలీ వర్మ వేగంగా బ్యాటింగ్ ప్రారంభించి ఒక భారీ సిక్స్ బాదినా, ఆ జోరును కొనసాగించలేకపోయింది. వరుసగా మూడు డాట్ బాల్స్ ఆడిన తర్వాత సాదియా ఇక్బాల్ బౌలింగ్లో వికెట్ కోల్పోయింది. షెఫాలీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ కూడా నిరాశపరిచింది. ఏడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి తీవ్ర ఒత్తిడిలో కనిపించింది. స్కోరును వేగవంతం చేయడానికి ప్రయత్నించిన జెమీమా షాట్ ఆడగా.. నటాలియా పర్వైజ్ అద్భుత క్యాచ్ పట్టడంతో ఆమె ఇన్నింగ్స్ కు తేర పడిందింది.
దీంతో భారత్ 18 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టు బాధ్యతను సీనియర్ బ్యాటర్లు హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన తమ భుజాలపై వేసుకున్నారు. ఇన్నింగ్స్ను చక్కదిద్దుతూ ఒకవైపు వికెట్లు కాపాడుకోవడం, మరోవైపు స్కోరింగ్ రేటును కొనసాగించడం వారి ముందున్న ప్రధాన సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ 36 పరుగులు, స్మృతి మంధాన 68 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోర్ ను అందించారు. మొత్తంగా టీమిండియా నిర్ణిత 20 ఓవర్స్ లో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు సాధించింది.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ 171 పరుగుల ఛేదనలో ఎక్కడ కూడా విజయం వైపు నడవలేదు. టీమిండియా ఆధిపత్యం చెలాయించడంతో పాక్ కేవలం 106 పరుగులకే కుప్పకూలాగా.. 64 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్పై టీమిండియా సాధించిన అతిపెద్ద విజయం ఇదే.

