Harish Rao: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్త నడకన సాగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 5 కిలోల తరుగు తీస్తున్న వారి తోలు తీయాలని హెచ్చరించారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం జూనూతల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని, మిల్లుల వద్ద లారీలు అన్ లోడ్ చేయడం లేదన్నారు. తాలు, పచ్చ గింజ పేరుతో కోతలు విధిస్తున్నారని హరీష్ రావు దృష్టికి రైతులు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస వసతులు లేవని రైతులు తెలిపారు.
READ MORE: Shobha Karandlaje: ఏప్రిల్ 17 భారత మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. “మొక్కజొన్న కొనుగోలు జరగడం లేదు. జొన్న కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభించలేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లుల వద్ద తీసుకోవడం లేదు. JJL 24433 దొడ్డు రకం కొనుగోలు చేయడం లేదు. KNM సన్న రకం వడ్లను కూడా కొనుగోలు చేయాలి. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలి. 70 సార్లు డిల్లీకి వెళ్ళిన సీఎం.. ఒక్కసారి కొనుగోలు కేంద్రాలకు రావాలి. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుంది. పంట బీమా లేదు, సన్నాలకు బోనస్ రావడం లేదు, రైతు భరోసా అందరికీ అందలేదు..” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
