Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!

Guntur Chilli Export

Guntur Chilli Export

Guntur Chilli Export Crisis: గుంటూరు మిర్చికి శ్రీలంకలో ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు నుంచి శ్రీలంకకు ఎగుమతి చేసిన మిర్చి కంటైనర్లలో నాణ్యత ప్రమాణాలు సరిగా లేవంటూ అక్కడి అధికారులు పలు కంటైనర్లను తిరస్కరించారు. మిర్చిలో అఫ్లోటాక్సిన్ స్థాయి, తేమశాతం నిబంధనల కంటే ఎక్కువగా ఉన్నట్లు ఎగుమతి వ్యాపారులకు శ్రీలంక అధికారులు తెలిపారు. తేమశాతం ఎక్కువగా ఉండటంతో మిర్చిలో ఫంగస్ ఏర్పడి నాణ్యత దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రిజెక్ట్ చేసిన మిర్చిని తిరిగి తమ దేశానికి తీసుకెళ్లాలని ఎగుమతి వ్యాపారులకు శ్రీలంక అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో గుంటూరు మిర్చి ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది.

మిర్చి కంటైనర్లను తిరస్కరించిన నేపథ్యంలో గుంటూరు మిర్చి ఎక్స్‌పోర్టర్స్ శ్రీలంకకు వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. సమస్యకు పరిష్కారం కనుగొని ఎగుమతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిర్చి ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘శ్రీలంకకు ఎగుమతి చేసిన కొన్ని కంటైనర్లలో అఫ్లోటాక్సిన్‌తో పాటు తేమశాతం కూడా అధికంగా ఉందని అధికారులు గుర్తించారు. గతంలోనూ పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొన్ని మిర్చి ఎగుమతులను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. తేమశాతం ఎక్కువగా ఉంటే అఫ్లోటాక్సిన్ శాతం పెరిగిపోతుంది. కోవిడ్ తర్వాత అనేక దేశాలు దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులను పరీక్షిస్తున్నారు. ఆయా దేశాల నిబంధనలకు లోబడి ఉన్న ఆహార ఉత్పత్తులనే అనుమతిస్తున్నారు. రైతులు కూడా పంటసాగులో పురుగుమందుల వాడకాన్ని తగ్గించాలి’ అని అన్నారు.

ఇటీవల కాలంలో శ్రీలంక స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్ కూడా ఆహార ఉత్పత్తుల విషయంలో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు సమాచారం. ఎగుమతి చేసే ఉత్పత్తులు తమ దేశ నిర్దేశించిన నాణ్యత, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడే వాటిని అనుమతిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక ఘటనకు ముందు కూడా గుంటూరు మిర్చికి విదేశాల్లో నాణ్యతకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యాయి. సుమారు రెండు నెలల క్రితం గుంటూరు నుంచి చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని అక్కడి అధికారులు తిరస్కరించినట్లు ఎగుమతిదారులు తెలిపారు. అనేక దేశాలు ఇప్పుడు ఆహార ఉత్పత్తుల విషయంలో నాణ్యతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న నేపథ్యంలో.. గుంటూరు మిర్చి ఎగుమతిదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో రైతులు పంట సాగులో పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి.. సూచించిన మోతాదులు, నిర్దిష్ట కాలపరిమితులను పాటించాలని ఎగుమతిదారులు సూచిస్తున్నారు. అలాగే మిర్చి కోత తర్వాత సరిగ్గా ఎండబెట్టి తేమశాతం నియంత్రించడం, నిల్వలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. గుంటూరు మిర్చికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్నప్పటికీ.. నాణ్యత ప్రమాణాల్లో చిన్నపాటి లోపాలు కూడా భారీ ఎగుమతి నష్టాలకు దారితీసే అవకాశం ఉంది. తాజా శ్రీలంక ఘటన నేపథ్యంలో రైతులు, ఎగుమతిదారులు నాణ్యత, పురుగుమందుల అవశేషాలు, తేమశాతం వంటి అంశాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.