Site icon NTV Telugu

Andhra Pradesh: గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు..

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు లక్ష్యంగా పనిచేస్తున్న సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. సచివాలయ ఉద్యోగుల సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను అమలు చేయనుంది. ఇందులో భాగంగా, ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు స్పష్టమైన కెరీర్‌ మార్గం కల్పించేందుకు మూడంచెల వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది.

Read Also: Nagavamsi : ధురంధర్ 2 కు పోటీగా వస్తున్న నాగవంశీ.. ఆ సినిమా రిలీజ్ కు ఏర్పాట్లు

ఈ మూడంచెల విధానంతో ఉద్యోగులకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతులు కల్పించనున్నారు.. బాధ్యతల విభజన, పనితీరు ఆధారంగా అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. దీని వల్ల ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, ప్రజలకు అందే సేవల నాణ్యత మరింత మెరుగుపడనుంది. ఇక, ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన ఉద్యోగులతో భర్తీ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇది ఉద్యోగులకు మరిన్ని అవకాశాలు కల్పించడమే కాకుండా, ప్రభుత్వ శాఖల్లో మానవ వనరుల లోటును కూడా తగ్గించనుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ఉత్సాహాన్నిచ్చే పరిణామంగా మారింది. అయితే, ఈ ప్రమోషన్లు, క్రమబద్ధీకరణకు సంబంధించిన వివరమైన మార్గదర్శకాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హతలు, సీనియారిటీ, సేవా కాలాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Exit mobile version