UP: యూపీలో బక్రీద్‌ రోజున హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..

Up News

Up News

UP: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన 17 ఏళ్ల సూర్య చౌహాన్ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్.. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘజియాబాద్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. బక్రీద్ పండుగ రోజున సూర్య చౌహాన్‌ను అసద్ దారుణంగా హత్య చేశాడు. అయితే, నగరంలో తలదాచుకున్న అసద్.. తన స్నేహితుడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుని నగరం విడిచి పారిపోయేందుకు ఖోరా ప్రాంతానికి వెళ్తన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఘజియాబాద్ పోలీసులు రంగంలోకి దిగి ఆ ప్రాంతంలో నిఘా పెట్టి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అసద్ మరో వ్యక్తితో కలిసి మోటార్ సైకిల్‌పై వస్తూ పోలీసులకు కనిపించాడు. వారిద్దరిని అడ్డుకుని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించగా, అసద్ ఒక్కసారిగా పోలీసులపైకి కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల మార్పిడిలో అసద్ తీవ్రంగా గాయపడ్డాడు.

తీవ్ర గాయాలపాలైన అసద్‌ను పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ సైతం గాయపడగా, ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అసద్ మరణించినట్లు ఆ తర్వాత వైద్యులు, ఉన్నతాధికారులు ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి నిందితుడు ఉపయోగించిన మోటార్ సైకిల్‌తో పాటు పోలీసులపై కాల్పులు జరిపేందుకు వాడిన నాటు తుపాకీ (కంట్రీ మేడ్ పిస్టల్) ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసుల కళ్లు గప్పి అసద్‌తో పాటు బైక్‌పై ఉన్న రెండో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు (సెర్చ్ ఆపరేషన్) తీవ్రతరం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌తో ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారిన సూర్య చౌహాన్ హత్య కేసులో ఒక కీలక ఘట్టం ముగిసినట్లయింది.

×
×
Ad

అసలు ఏం జరిగింది?
బక్రీద్ పండుగ రోజున ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ఖోరా పరిధిలోని నవనీత్ విహార్‌లో దారుణం జరిగింది. చౌదరి స్కూల్ సమీపంలో 17 ఏళ్ల మైనర్ బాలుడిపై కొందరు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సదరు బాలుడిని నోయిడా సెక్టార్ 62 లోని ఫోర్టిస్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మే 28వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఈ దాడి వెనుక ఐదుగురు నలుగురు మైనర్ యువకులు ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని నెలల క్రితం బాధితుడికి, నిందితులకు మధ్య ఒక వివాదం జరిగిందని, ఆ పాత కక్షలను మనసులో ఉంచుకునే బాలుడిని ప్లాన్ ప్రకారం ఘటనా స్థలానికి పిలిపించి, గొడవ పడి కత్తులతో పొడిచారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కొందరు యువకులు మొదట బాధితుడిని పిలిచి, అతనిపై కొన్ని వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే ఈ దాడికి పాల్పడ్డారు. అయితే పోలీసులు ఈ విషయాలను అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది, కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు.