FSSAI Action Against Dabur: 145 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ డాబర్ ఇండియాపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) కఠిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కంపెనీ ఉత్పత్తులపై చేస్తున్న ‘100% సహజం’, ‘100% స్వచ్ఛమైనది’, ‘100% స్వచ్ఛతకు హామీ’, ‘100% సేంద్రీయం’ వంటి ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఎఫ్ఎస్ఎస్ఏఐ అభిప్రాయపడినట్లు వెల్లడైంది.
ఈ నేపథ్యంలో ఆయా వాదనలతో విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తుల అమ్మకాలపై చర్యలు తీసుకోవడంతో పాటు, కంపెనీ 15 రోజుల్లోగా వివరణాత్మక నివేదిక సమర్పించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించినట్లు సమాచారం. ఇటువంటి ప్రకటనలు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అడ్వర్టైజింగ్ అండ్ క్లెయిమ్స్) రెగ్యులేషన్స్–2018 నిబంధనలకు విరుద్ధమని నియంత్రణ సంస్థ పేర్కొన్నట్లు వెల్లడైంది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ విడుదల చేసిన జాబితాలో డాబర్ తేనె, డాబర్ ఆవు నెయ్యి, డాబర్ ఆపిల్ వెనిగర్, డాబర్ వర్జిన్ కొబ్బరి నూనె, డాబర్ నువ్వుల నూనె, డాబర్ కొబ్బరి నీరు, డాబర్ కొబ్బరి పాలు, డాబర్ హిమాలయన్ ఆర్గానిక్ ఆపిల్ సైడర్ వెనిగర్, డాబర్ ఆర్గానిక్ తేనె వంటి ఉత్పత్తులు ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఈ పరిణామం డాబర్ ఇండియా షేర్లపై కూడా ప్రభావం చూపింది. మంగళవారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే కంపెనీ షేరు ధర సుమారు 5 శాతం మేర పడిపోయి రూ.406 వద్ద ట్రేడైంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.71,880 కోట్లకు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
భారతీయ బహుళజాతి వినియోగ వస్తువుల సంస్థ అయిన డాబర్ను ఎస్.కె. బర్మన్ 1884లో స్థాపించారు. స్వాతంత్ర్యానికి ముందే ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం ఆయుర్వేద, ఆహార, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల తయారీలో దేశవ్యాప్తంగా ప్రముఖ స్థానంలో ఉంది. అయితే, FSSAI తీసుకున్న తాజా చర్యలతో ఆ కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపినట్టు అయ్యింది.. మరోవైపు.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI)కి డాబర్ ఇండియా ఎలాంటి సమాధానం ఇవ్వనుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది..

