Fiber Net Case: ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ జనవరి 17కు వాయిదా పడింది. నేటి మధ్యాహ్నాం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలోకి రాగా న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ్ బోస్, జస్టిస్ బేల ఎం. త్రివేది ధర్మాసనం విచారణ చేసింది. ఈ సందర్భంగా కోర్టు ఇరు వర్గాలకు పలు సూచనలు చేసింది. ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన విషయాలపై బయట ఎలాంటి కామెంట్స్ చేయొద్దని ధర్మాసనం సూచించింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని ఆదేశాలను జారీ చేసింది. 17- ఏపై చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్పై తీర్పు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో ఆ అంశంపై తీర్పు వచ్చాకే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ చేస్తామని సుప్రీం ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. అప్పటి వరకు చంద్రబాబును అరెస్టు చేయకూడదనే నిబంధనలు కొనసాగుతాయని గతంలోనే కోర్టు స్పష్టంగా చెప్పింది.
Read Also: PM Modi: కాంగ్రెస్ ‘మనీ హీస్ట్’.. 70 ఏళ్లుగా దోచుకుంటోంది..
ఇదిలా ఉంటే టీడీపీ అధికారంలో ఉండగా.. ఫైబర్నెట్ కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ సీఐడీ కేసు ఫైల్ చేసింది. ఏపీ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా దాన్ని కోర్టు తిరస్కరించింది. దీంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ను జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ చేస్తుంది. అయితే, చంద్రబాబు తరపున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. మరో వైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిల్ పై సుప్రీంకోర్టు తీర్పును ఇంకా వెల్లడించలేదు.. ఈ కేసులో తీర్పు ఇతర కేసులపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.