Everest Snowstorm: ఎవరెస్ట్‌పై మంచు తుపాను.. ప్రమాదంలో 1000 మంది ప్రాణాలు..

Everest Snowstorm

Everest Snowstorm

Everest Snowstorm: టిబెట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతం అయిన ఎవరెస్ట్‌‌పై మంచు తుపాను బీభత్సం సృష్టించింది. ఎవరెస్ట్‌ పర్వతం తూర్పువాలు వైపు శుక్రవారం సాయంత్రం నుంచి దట్టంగా మంచు కురుస్తోంది. ఈక్రమంలో ఆదివారానికి అది కాస్త మంచు తుపానుగా మారింది. మంచు తుపాను కారణంగా సుమారుగా 1000 మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. మంచు తుపాన్‌లో చిక్కుకుపోయిన పర్వతారోహకులను రక్షించేందుకు అధికారులు ఇప్పటికే స్థానికులతో కలిసి సహాయక చర్యలు ప్రారంభించారు.

READ ALSO: Jubilee Hills ByPoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఎప్పుడంటే?

350 మందిని రక్షించిన అధికారులు..
ఎవరెస్ట్‌ పర్వతం తూర్పువాలు వైపు సుమారు 1000 మంది పర్వతారోహకులు క్యాంప్‌ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మంచు తుపాను కారణంగా వాళ్లు అక్కడ చిక్కుకుపోయారు. ఈక్రమంలో వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మర సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 350 మందిని ఇప్పటి వరకు రక్షించి క్యుడాంగ్‌ అనే చిన్న టౌన్‌షిప్‌కు తరలించినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా పలువురు రెస్క్యూ సిబ్బంది మాట్లాడుతూ.. ఎవరెస్ట్‌ పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చరియలు పడి దారులు మూసుకుపోయాయని తెలిపారు. సాధారణంగా ఈ వైపు నుంచే పర్వతారోహకులు, హైకర్లు ఎక్కువగా ఎవరెస్ట్‌ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారని చెప్పారు. ప్రస్తుతం వాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు, సిబ్బంది శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ఎవరెస్ట్‌ పైకి వెళ్లేందుకు అనుమతులు నిలిపివేసినట్లు తెలిపారు.

చైనాలో సెలవులు కావడంతో పెరిగిన రద్దీ..
ఇప్పుడు చైనాలో సెలవులు కావడంతో ఎవరెస్ట్‌పైకి వెళ్లే వారి రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో మంచు తుపాను రావడంతో పర్వతారోహులు అక్కడ చిక్కుకుపోయారు. పర్వతంపై చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైకర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే వారిలో కొంతమంది హైపోథెర్మియా బారినపడినట్లు రెస్క్యూ బృందం తెలిపింది. సాధారణంగా అక్టోబరులో ఈ మంచు పర్వతంపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

READ ALSO: American Conspiracy India: హిందువులే టార్గెట్‌గా భారత్‌లో అమెరికన్‌ల భారీ కుట్ర!