Earth’s Magnetic Poles: భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం రష్యా వైపు కదులుతోంది.. ప్రళయం తప్పదా..?

  • వేగంగా కదులుతున్న భూమి ఉత్తర ధ్రువ అయస్కాంత క్షేత్రం..
  • కెనడా నుంచి సైబీరియా వైపుగా కదలిక..
  • దక్షిణ ధ్రువంలో కూడా మార్పు..
  • భూమిపై విపరీత పరిణామాలు..
Earth's Magnetic Poles

Earth's Magnetic Poles

Earth’s Magnetic Poles: భూమి అయస్కాంత క్షేత్రం వేగం మార్పులకు గురవుతున్నట్లు బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూమి ఉత్తర ధ్రువ అయస్కాంత క్షేత్రం వేగంగా రష్యా వైపు కదులుతున్నట్లుగా చెప్పారు. లైవ్ సైన్స్ ప్రకారం.. శాస్త్రవేత్తలు దశాబ్ధాలుగా ఉత్తర ధ్రువాన్ని ట్రాక్ చేస్తున్నారు. ఇది కెనడా నుంచి సైబీరియా వైపు 2250 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ దాని కదలిక ఇటీవల కాలంలో వేగవంతమైంది. 1990-2005 మధ్య కదలిక రేటు ఏడాదికి 15 కి.మీ నుంచి 50-60 కి.మీకి పెరిగింది.

భూమి అయస్కాంత క్షేత్రాలు మన నిత్య జీవితంలో చాలా పనులతో ముడిపడి ఉన్నాయి. నావిగేషన్ వ్యవస్థకు ఉపయోగపడటంతో పాటు భూమి, భూ వాతావరణాన్ని, జీవజాలాన్ని ప్రమాదకర రేడియేషన్ నుంచి రక్షిస్తోంది. మనం ఉపయోగించ జీపీఎస్ వ్యవస్థకు ఉత్తర అయస్కాంత ధ్రువం ముఖ్యమైందింది.

అయస్కాంత ధ్రువాల కదలిక అంటే ఏమిటి..?

మన స్మార్ట్ ఫోన్లు, ఇతర పరికరాలను నావిగేట్ చేయడానికి అనుమతించే కీలకమైన పాయింట్‌ మార్పుని శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తున్నారు. ఈ కదలిక వేగంగా కొనసాగితే రాబోయే దశాబ్ధంలో భూమి అయస్కాంత ఉత్తర ధ్రువం 660 కిలోమీటర్లు కదులుతుంది. బ్రిటీష్ జియోలాజికల్ సర్వే (BGS) శాస్త్రవేత్తల ప్రకారం, 2040 నాటికి అన్ని దిక్సూచిలు బహుశా నిజమైన ఉత్తరానికి తూర్పు వైపుగా సూచిస్తాయి.

మరోవైపు దక్షిణ ధ్రువం కూడా కదులుతోంది. అంటార్కిటికా మీదుగా తూర్పు వైపుకు జారిపోతోంది. ప్రతి 300,000 సంవత్సరాలకు స్విచ్ జరుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. చివరి సారిగా ఇలా ధ్రువాలు మారడం 7,80,000 ఏళ్ల క్రితం జరిగింది. కాబట్టి చాలా కాలం అవుతుందని చెబుతున్నారు.

పోల్స్ ఎందుకు కదులుతున్నాయి..?

భూమి బయటి కోర్‌లోని ద్రవ రూపంలోని ఇనుము అనూహ్య మార్గాల్లో ప్రవహిస్తుంటుంది. దీని వల్ల అయస్కాంత ధ్రువాలు మారుతుంటాయి. ధ్రువాలు ఇటా మారినప్పుడు, ఆపోజిట్ పొలారిటీ మళ్లీ పెరగడానికి ముందు మాగ్నిటిక్ ఫీల్డ్ జీరోకి చేరుతుంది.

భూమి మాగ్నిటిక్ ఫీల్డ్ జీరోకి చేరితే ఏమవుతుంది..?

భూమి అయస్కాంత క్షేత్రం భూమిని రక్షిస్తోంది. సూర్యుడు, ఇతర అంతరిక్ష పదార్థాల నుంచి వచ్చే ఆవేశిత కణాలను, రేడియేషన్‌ని ఈ మాగ్నిటిక్ ఫీల్డ్ తిప్పికొడుతోంది. భూమి కోర్ నుంచి అంతరిక్షంలోకి ఒక బుడగలా ఏర్పడి భూమిని ఎల్లప్పుడూ రక్షిస్తూనే ఉంది. ఒక వేళ ఈ అయస్కాంత క్షేత్రం అదృశ్యమైతే, భూమిపై రేడియేషన్ పెరుగుతుంది. తద్వారా జీవ కనాల మ్యుటేషన్ రేటు పెరుగుతుంది. జంతువుల్లో క్యాన్సర్‌కి దారి తీస్తుంది.