Indian Player: వైభవ్ సూర్యవంశీ కంటే తోపు అన్నారు.. కట్ చేస్తే మైదానంలోనే పరువు పోయింది..

Aarya

Aarya

దిగ్వేశ్ రాఠీ ఢిల్లీ తరఫున ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించి, 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టీ20 రంగేట్రం చేశాడు. తన లెగ్ స్పిన్ వేరియేషన్లతో అద్భుతంగా రాణించి లక్నో సూపర్‌జెయింట్స్ జట్టులో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో వికెట్ తీసిన ప్రతిసారీ రాఠీ వినూత్నంగా చేసే ‘నోట్‌బుక్ సెలబ్రేషన్’ విశేష ఆదరణ పొందింది. అయితే మైదాన నిబంధనలు ఉల్లంఘించడంతో అతడిపై జరిమానాలు పడ్డాయి. మొదట మ్యాచ్ ఫీజులో 25 శాతం, తర్వాత 50 శాతం చొప్పున కోత పడటమే కాకుండా, మూడోసారి ఒక మ్యాచ్ సస్పెన్షన్, డిమెరిట్ పాయింట్లు కూడా చవిచూశాడు.

అయినప్పటికీ తన మార్క్ సెలబ్రేషన్స్‌ను పూర్తిగా విడిచిపెట్టని రాఠీ, ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను అవుట్ చేసినప్పుడు నేలపై సంతకం చేస్తున్నట్లుగా కొద్దిగా మార్చబడిన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL 2026)లో ఔటర్ ఢిల్లీ వారియర్స్, పురాణీ ఢిల్లీ-6 జట్ల మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఔటర్ ఢిల్లీ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య ఇటీవల రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కంటే తానే మెరుగైన సిక్సర్లు కొట్టగలనని ప్రకటించుకుని వార్తల్లో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతుల్లో 30 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న ఆర్యను పురాణీ ఢిల్లీ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ లాంగాన్ దిశగా క్యాచ్ అవుట్ చేశాడు.

వికెట్ తీసిన వెంటనే రాఠీ గాల్లో ఊహాత్మక నోట్‌బుక్‌పై రాస్తున్నట్లుగా తన పాత ట్రేడ్‌మార్క్ నోట్‌బుక్ శైలిలోనే మళ్ళీ సెలబ్రేషన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రాఠీ 3/25 గణాంకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరచగా, అతడి వికెట్ సంబరాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వైభవ్ కంటే అద్భుతంగా ఆడతాను అని చెప్పడం కాదు.. ఆటల్లో చూపించాలంటూ ప్రియాంశ్ ఆర్యపై నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.