తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో పోలేరమ్మతల్లి జాతర ఉత్సాహంగా జరిగింది. గ్రామదేవతకు ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలతో జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ జాతరలో పాల్గొని సందడి చేశారు. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి, సినీ మాటల రచయిత జీ.సత్యమూర్తి స్వస్థలం వెదురుపాక కావడంతో.. ప్రతి సంవత్సరం జాతర సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామానికి వచ్చి పూజల్లో పాల్గొంటుంటారు.
ఈ ఏడాది కూడా పోలేరమ్మతల్లి జాతరకు హాజరైన దేవిశ్రీ ప్రసాద్.. గ్రామస్తులతో కలిసి మెలిసి గడిపారు. జాతరలో భాగంగా నిర్వహించిన గరగ నృత్యంలో పాల్గొన్న ఆయన.. స్థానిక కళాకారులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేసి అందరినీ అలరించారు. దేవిశ్రీ రాకతో జాతర వేడుకలకు మరింత ఉత్సాహం నెలకొంది. గ్రామస్తులు, అభిమానులు ఆయనను ఆత్మీయంగా ఆహ్వానించి సంతోషం వ్యక్తం చేశారు.
