Site icon NTV Telugu

Hyderabad Real Estate Scam: ఫ్లాట్ ఇస్తామన్నారు.. కోట్లు నొక్కేశారు! కూకట్‌పల్లిలో రూ. 270 కోట్ల భారీ కుంభకోణం..

Hyderabad Real Estate Scam

Hyderabad Real Estate Scam

Hyderabad Real Estate Scam: రండి.. త్వరపడండి.. ఆలోచిస్తే ఆశాభంగం.. అంటూ ఊదరగొట్టే ప్రకటనలు ఇస్తారు. అతి తక్కువ ధరకే ఫ్లాట్స్ ఇస్తామంటూ ఊరిస్తారు. తీరా చూస్తే.. డబ్బులు కట్టించుకుని ఏళ్లకు ఏళ్లు.. వారి చుట్టూ తిప్పించుకుంటారు. డబ్బులు చేతిలో పడ్డాక.. ఉసూరమనిపిస్తారు. అంతా రియల్ మాయాజాలం. ఆ రియల్ మాయకు అమాయకులైన జనం మోసపోతున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి రియల్ మోసాలు చాలా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి చీటింగ్ గ్యాంగ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో వైట్ వాటర్ పేరుతో ఫ్లాట్స్ అమ్ముతున్నామని ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో మోసం చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు 500 మంది నుంచి 270 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. పదేళ్ల నుంచి ప్రాజెక్టు పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేసిన సుజాత చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వైట్ వాటర్ కన్స్ట్రక్షన్ యజమాని అజయ్‌తో పాటు పలువురుపై కేసుల నమోదు చేసి సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు విచారణ చేస్తున్నారు

READ ALSO: Fake Call Center: అమెరికా పౌరులకు చుక్కలు చూపుతున్న భారతీయ మోసగాళ్లు!

ఈ కేసు మూసాపేట పవర్ నగర్ కాలనీకి చెందిన భోగాడి సుజాత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేశారు పోలీసులు. ఐతే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. వైట్ వాటర్స్ యాజమాన్యానికి ఫ్లాట్ కొనుగోలు కోసం ఫిర్యాదుదారు సుజాత సుమారు 80 లక్షల రూపాయలు చెల్లించారు. కానీ ఆమె తీసుకున్న ఫ్లాట్‌ను బ్యాంకులో తనఖా పెట్టినట్లు ఆమెకు తెలిసింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. మరోవైపు వైట్ వాటర్స్ యాజమాన్యం.. ఫ్లాట్ల కొనుగోలుదారులకు ఫ్లాట్లను స్వాధీనం చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇప్పటికే డబ్బు చెల్లించి పదేళ్లు గడిచిపోయిందని బాధితులు చెబుతున్నారు. పైగా ధరలు పెంచడం, ఒకే ఫ్లాట్‌ను పలుమార్లు అమ్మారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వైట్ వాటర్స్ యాజమాన్యంపై BNS సెక్షన్లు 318(4), 316(2), 316(5)తోపాటు తెలంగాణ డిపాజిటర్ల రక్షణ చట్టం సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేశారు.

నిజానికి ఈ వైట్ వాటర్స్ ప్రాజెక్టు వెంచర్‌ను 2018లో ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు కేవలం A, B టవర్స్‌లో నిర్మాణం కొంతమేర పూర్తయింది. C, D టవర్ల బేస్‌మెంట్లు మాత్రమే పూర్తి చేశారు. E, F టవర్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. RERA నమోదు గడువు ఇప్పటికే రెండుసార్లు పొడిగించగా.. ఈ ఏడాది జూన్‌లో అది కూడా ముగియనుందని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. గతంలో డిసెంబర్ 2024, డిసెంబర్ 2025లో ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి మోసం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. వైట్ వాటర్స్ యజమాని అజయ్‌‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుకున్నారు.

ముందస్తుగా డబ్బులు చెల్లిస్తే అతి తక్కువ ధరకే ఫ్లాట్ ఇస్తామంటూ అందరిని నమ్మించాడు అజయ్. దీంతో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో వచ్చిన దీనిని ఆకర్షితులై చాలా మంది పెట్టుబడులు పెట్టారు. ఇప్పటివరకు 270 కోట్ల రూపాయలకు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. EOW పోలీసులకి ఇప్పటివరకు వందమంది కాంటాక్ట్ అయ్యారు. మరోవైపు పోలీస్ కేసు నుంచి తప్పించుకునేందుకు అజయ్ కొత్త నాటకానికి తెర తీసినట్టు బాధితులు చెబుతున్నారు. తమకు డబ్బులు ఇస్తామని చెప్పి నమ్మించి.. కొందరి చేత కేసులు విత్ డ్రా చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

READ ALSO: Jubilee Hills Robbery Case: చోరీ కేసులో సంచలన మలుపు.. నేపాల్ బోర్డర్‌లో నిందితుల అరెస్ట్!

Exit mobile version