దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నడుమ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష విరమించిన అనంతరం, వేలాది మంది యువతతో కలిసి పార్లమెంట్ ముట్టడికి ‘చలో సంసద్’ ర్యాలీగా దూసుకువెళ్తుండగా పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతా దళాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. ముందడుగు వేస్తున్న యువతను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ (భాష్పవాయువు) ప్రయోగించారు. ఈ తోపులాటలో పలువురు గాయపడ్డారు.
మరోవైపు, సీజేపీ ర్యాలీ నేపథ్యంలో పార్లమెంట్లోనూ దీనిపై తీవ్ర దుమారం రేగింది. విద్యార్థులు, యువతపై పోలీసుల లాఠీఛార్జ్ను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో తీవ్రంగా ఖండించారు. ఈ గందరగోళం కారణంగా పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి.
దిద్దుబాటు చర్యలు:
పరిస్థితి చేదాటిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిరసనకారుల ప్రధాన డిమాండ్లపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో ఇద్దరు కేంద్ర మంత్రులు పార్లమెంట్ లోపల అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రతినిధులుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపేందుకు సీజేపీ ప్రతినిధుల బృందం వెళ్ళింది. ప్రస్తుతం ఢిల్లీ వీధుల్లో భారీగా పారామిలటరీ బలగాలను మోహరించారు.

