తెలుగు రాష్ట్రాల్లోని మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ లవర్స్కు ఇది నిజంగా ఊరటనిచ్చే వార్త. గత కొన్ని వారాలుగా ఆకాశాన్ని తాకిన చికెన్ ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. సామాన్యుడికి అందుబాటులో లేనంతగా పెరిగిన ధరలు, ఇప్పుడు మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో మార్కెట్లు చికెన్ ప్రియులతో కళకళలాడుతున్నాయి.
ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు..
మార్చి నెల ప్రారంభంలో ఎండల తీవ్రత పెరగడం కోళ్ల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో కోళ్ల ఫారాల్లో మరణాల సంఖ్య పెరిగింది, దీనికి తోడు కోళ్ల దాణా ఖర్చులు కూడా భారమవ్వడంతో యజమానులు ధరలను పెంచక తప్పలేదు. అదే సమయంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత వారం కిలో చికెన్ ధర రికార్డు స్థాయిలో రూ. 400 మార్కును తాకింది.
అయితే.. ప్రస్తుతం మార్కెట్లోకి కోళ్ల సరఫరా మెరుగుపడటం, ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు రావడంతో ధరలు అదుపులోకి వచ్చాయి. వారం వ్యవధిలోనే దాదాపు రూ. 100 వరకు ధర తగ్గడం గమనార్హం. ప్రస్తుతం భాగ్యనగరంలో నేడు స్కిన్లెస్ చికెన్ ధర కేజీ రూ. 270 వరకు పలుకుతోంది. ఓరుగల్లులో కూడా ఇదే తరహాలో రూ. 270 నుంచి రూ. 280 మధ్య ధరలు ఉన్నాయి.
ఇక ఏపీలోని అమలాపురం వంటి ప్రాంతాల్లో ధరలు కొంత ఎక్కువగా ఉండి, కేజీ రూ. 300 నుంచి రూ. 350 వరకు పలుకుతున్నాయి. చికెన్ ధరలు రూ. 400 దాటడంతో గత వారం చాలామంది వినియోగదారులు చికెన్ కొనడానికి వెనకడుగు వేశారు. కొందరు ప్రత్యామ్నాయంగా చేపలు, రొయ్యలు వంటి సీ-ఫుడ్ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ధరలు తగ్గడంతో మళ్ళీ చికెన్ సెంటర్ల వద్ద రద్దీ పెరుగుతోంది. హైదరాబాద్ లోని కొన్ని చికెన్ షాపుల ఎదుట నేడు చాలా మంది క్యూ కట్టడం కనిపించింది. అంతే కాకుండా.. ఈ చికెన ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని కొందరు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో చికెన్ కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి. తాజా మాంసాన్ని మాత్రమే ఎంచుకోవాలని, నిల్వ ఉంచిన మాంసం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
