రిఫ్రెషింగ్ ఫీల్తో రూపొందుతున్న చిత్రం ‘ప్రణయగోదారి’. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల గణేష్ మాస్టర్ చేతుల మీదుగా విడుదల చేసిన గు…గుగ్గు అనే పాటకు కూడా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం నుంచి మరో బ్యూటీఫుల్ మెలోడి సాంగ్ చూడకయ్యో.. నెమలికళ్ళ అనే పాటను ఆస్కార్ అవార్డ్ విన్నర్ ప్రముఖ లిరిసిస్ట్ చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇప్పుడే పాట విన్నాను.. చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా అనే పల్లవితో కొనసాగే ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం వుంది.
మార్కండేయ ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు. చక్కటి జానపద సాహిత్యం ఇది. అందరికీ చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా మంచి సాహిత్యం అందించారు. పాట బాణీతో పాటు నడక, దాని వెనకాల వచ్చే బీట్ కూడా నాకు బాగా నచ్చింది. గాయనీ సునీత, సాయిచరణ్ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. నాకు ఈ మధ్య కాలంలో అమితంగా నచ్చిన పేరు ‘ప్రణయగోదారి’ టైటిల్ చాలా కవితాత్మకంగా వుంది. చిత్రం కూడా అంతే వుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పాటతో పాటు చిత్రం కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను’ అన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ను త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.