ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశం దేశ ప్రజలకు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు , గ్రామీణ ప్రాంతాల వారికి ఎన్నో తీపి కబుర్లు అందించింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, సామాన్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ భేటీలో పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న తరుణంలో ఉద్యోగుల ఆర్థిక భారాన్ని తగ్గించడం, సముద్ర రవాణాను మరింత సురక్షితం చేయడం మరియు గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి అంశాలకు ఈ సమావేశంలో పెద్దపీట వేశారు. రాజకీయంగా కూడా మహిళా సాధికారత అంశంపై ఈ భేటీలో చర్చ జరగడం విశేషం.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కరువు భత్యాన్ని (డీఏ) 2 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సెప్టెంబర్ చివరిలో రావాల్సిన ఈ ప్రకటన కొంత ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఏటా రెండుసార్లు ప్రభుత్వం ఈ పెంపును చేపడుతుంది. సముద్ర రంగంలో భద్రత కోసం రూ. 13,000 కోట్లతో సావరిన్ మారిటైమ్ ఫండ్ను ఏర్పాటు చేయడం మరో ముఖ్యమైన నిర్ణయం.
Also Read:Tech Layoffs 2026: మీరు ఐటీ ఉద్యోగులా? అయితే ఈ రిపోర్ట్ చదవాల్సిందే.. 5 ఏళ్లలో 10 లక్షల మంది ఇంటికి!
ఇది భారతీయ నౌకలకు తక్కువ ధరకే బీమా సౌకర్యం కల్పిస్తూ, అంతర్జాతీయ వాణిజ్యానికి అండగా నిలుస్తుంది. అదేవిధంగా.. గ్రామాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రధాని గ్రామ సడక్ యోజనను 2028 వరకు పొడిగిస్తూ మరో రూ. 3,000 కోట్లు కేటాయించారు. చివరగా.. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల తీరును ప్రధాని ఖండిస్తూ, మహిళల హక్కుల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
