విజయవాడలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన మెరుపు దాడిలో రూ.15 లక్షల లంచం తీసుకుంటూ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ బాపిరాజు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు శ్రీచంద్ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. రూ.179.50 కోట్ల విలువైన ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పనులను గణపతి ఇంజినీరింగ్ వర్క్స్, యెల్లా కన్స్ట్రక్షన్స్ జాయింట్ వెంచర్ సంస్థ చేపట్టింది.
ఈ ప్రాజెక్ట్ పనులను ముందస్తుగా పూర్తి చేసినందుకు సదరు జాయింట్ వెంచర్ రూ.7 కోట్ల బోనస్ కోసం క్లెయిమ్ చేసింది. ఈ బోనస్ మంజూరుకు అనుకూలంగా ఫైల్ తేదీలలో మార్పులు చేసి, బోనస్ త్వరితగతిన విడుదల అయ్యేలా సహకరించడానికి ఇంజినీర్ బాపిరాజు రూ.15 లక్షల లంచం డిమాండ్ చేశారు.
ప్రైవేట్ కంపెనీ ఎండీ కుమారుడు విశాఖపట్నం నుండి విజయవాడ వచ్చి శ్రీచంద్ ద్వారా ఈ లంచం మొత్తాన్ని అందజేస్తుండగా సిబిఐ అధికారులు ట్రాప్ చేసి ఆ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సిబిఐ బృందాలు విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్లలోని నిందితుల ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ కుట్రలో మరికొందరి పాత్రపై ఆరా తీస్తూ విచారణను వేగవంతం చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను ఆగస్టు 17న విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు.

