కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించి, కేవలం పబ్లిసిటీ కోసమే పాకులాడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నీట్ పరీక్షల లీకేజీ వ్యవహారంలో మంత్రి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనివల్ల సుమారు మూడు లక్షల మంది నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రి తన పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో స్పోర్ట్స్ కోటా కింద అర్హత ఉన్నవారికి నేరుగా ఉద్యోగాలు లభించేవని, కానీ ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చాక జీవోలను సవరించి తమకు నచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టుకుందని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ఆరోపణలపై విచారణ జరిపించి క్లీన్ చిట్తో బయటకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. రూ. 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు నిలిచిపోయాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ కొట్టేసేందుకు ప్రభుత్వం అట్టహాసంగా ఊరేగింపులు చేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 15 వేల ఎకరాలు కావాలని చెప్పి కనీసం భూసేకరణ కూడా పూర్తి చేయలేకపోయారని గుర్తుచేశారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అన్ని రకాల క్లియరెన్సులు తీసుకువచ్చి పనులను వేగవంతం చేశామని తెలిపారు.
ఇక విజయనగరంలో వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంపై పదేపదే మాట్లాడడం సరికాదని హితవు పలికారు. రాజభరణాలు పోయినా ఇంకా రాచరిక మనస్తత్వంతో మాట్లాడటం తగదన్నారు. మాన్సాస్ ట్రస్ట్లో అవకతవకలు ఉన్నాయని, దానిని ప్రభుత్వంలో కలపాలని గతంలో ఆనంద గజపతి రాజే లేఖ రాసిన విషయాన్ని అశోక్ గజపతి రాజు కాదనగలరా అని ప్రశ్నించారు. ఈ అంశాలపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని, కూటమి నేతలు చర్చకు రాగలరా అని బొత్స సవాల్ విసిరారు.

