Bangalore Stampede: బెంగళూరు నగరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవాల సందర్భంగా జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై ప్రభుత్వం చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్తో పాటు మరో నలుగురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.
సస్పెండ్ అయిన పోలీసు అధికారుల వివరాలను పరిశీలిస్తే, తొక్కిసలాట ఘటనకు భద్రతా విఫలమయ్యిందని గుర్తించిన ప్రభుత్వం ముందస్తు చర్యగా పలు స్థాయి అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ ఆర్డర్ పొందిన వారిలో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్, అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) వికాస్ కుమార్ వికాస్, సెంట్రల్ డిసిపి టి. శేఖర్, కబ్బన్ పార్క్ ఏసిపి బాలకృష్ణ, కబ్బన్ పార్క్ పోలీస్ ఇన్స్పెక్టర్ గిరీష్తో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు.
Read Also: Minister Atchannaidu: ఆ విషయంలో రైతులకు ఆందోళన వద్దు.. మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..
ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి, న్యాయ విచారణకు ఆదేశించినట్లు సీఎం తెలిపారు. ఘటన జరిగిన విధానం, జారీ చేసిన భద్రతా ఏర్పాట్లలో వైఫల్యం, ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వంటి అంశాలపై విచారణ జరుగనుంది.
