Site icon NTV Telugu

ATM shootout: ఏటీఎం దొంగలు ఎక్కడ? చోరీ కేసులో కొనసాగుతున్న పోలీసుల వేట!

Atm Shootout

Atm Shootout

ATM shootout: హైదరాబాద్ కోఠిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద కాల్పులు, చోరీ కేసులో దుండగుల వేట కొనసాగుతోంది. కోఠిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద మూడు రోజుల క్రితం తెల్లవారుజామున 6 గంటల 53 నిమిషాలకు నాంపల్లికి చెందిన రిన్షాద్ ఏటీఎం డిపాజిట్ మిషన్‌లో డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అప్పటికే ఇద్దరు గుర్తు తెలియని దుండగులు.. ఆ ఏటీఎం సెంటర్ వద్ద ఎదురుచూస్తున్నారు. రిన్షాద్ తన టూవీలర్‌ని ఆపి బ్యాగ్‌తో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. అదే సమయంలో దుండగులు అతన్ని అడ్డగించారు. రిన్షాద్ భుజానికి ఉన్న బ్యాగును లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రిన్షాద్ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, అప్పటికే తమ వెంట తెచ్చుకున్న తపంచాతో దుండగుల్లో ఒకరు బెదిరించారు. ఐనా.. బ్యాగును రిన్షాద్‌ వదలకపోవడంతో.. రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక రౌండ్ బుల్లెట్ రిన్షాద్ కుడికాలి మోకాలి కింద దూసుకుని పోయింది. మరొకటి మిస్ఫైర్ అయింది.

READ ALSO: Hyderabad: చీకటి పడితే చాలు.. రేసింగ్‌లు, స్టంట్‌లతో భయాందోళనలో వాహనదారులు!

కాల్పుల తర్వాత తీవ్రంగా గాయపడ్డ రిన్షాద్.. తన చేతిలో బ్యాగ్‌లో వదిలేయడంతో దాన్ని లాగేసుకుని బయటకు వెళ్లారు దుండగులు. అంతేకాదు తాము పారిపోయేందుకు.. రిన్షాద్ తీసుకువచ్చిన టూవీలర్‌నే ఉపయోగించారు. కోఠి నుంచి ఉమెన్స్ కాలేజ్ మీదుగా కాచిగూడ వరకు చేరుకున్నారు. అనంతరం కాచిగూడ సమీపంలో బట్టలు మార్చుకున్నారు. అక్కడే రిన్షాద్ టూవీలర్‌ను వదిలేశారు. ఆ తర్వాత కాచిగూడ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌కు ఆటోలో వెళ్లారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌లోకి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. అక్కడి నుంచి మరో ఆటోలో సంతోష్ నగర్ దగ్గర ఉన్న డిఆర్‌డీఓ దగ్గరికి వెళ్లారు. అక్కడ ఆటో దిగి కొద్ది దూరం నడిచి మరో ఆటో తీసుకొని బార్కాస్ వరకు వెళ్లారు. ఇలా సంఘటన స్థలం నుంచి టూ వీలర్‌తో పాటు మూడు ఆటోలను ఛేంజ్ చేశారు దుండగులు. ఇలా పోలీసులకు చిక్కకుండా పకడ్బందీగా చాకచక్యంగా వ్యవహరించారు ఇద్దరు దుండగులు.

కోఠిలో కాల్పుల ఘటన జరగడానికి ముందు.. హైదరాబాద్‌లోనే ఇద్దరు దుండగులు షెల్టర్ తీసుకున్నట్లుగా గుర్తించారు. మొత్తం 800 సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు.. బార్కాస్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ వైపు పారిపోయినట్లుగా గుర్తించారు. దీంతో వారిని పట్టుకునేందుకు దర్యాప్తు బృందంలోని రెండు టాస్క్‌ఫోర్స్ టీమ్స్ యూపీకి వెళ్లాయి.

READ ALSO: Fake Baba Arrest: దొంగ బాబా ఆట కట్టించిన ఖాకీలు

Exit mobile version