Heatwave Alert: భగభగమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. మరో మూడు రోజుల పాటు ఇదే తప్పదు సుమీ..!

Heatwave Alert

Heatwave Alert

Heatwave Alert: ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. మరో మూడు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య అవసరం లేకుండా బయటకు రావొద్దని సూచించింది. అత్యవసర ప్రయాణాలు చేసే వారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకెళ్లాలని తెలిపింది.

ఆదివారం (మే 24) రాష్ట్రంలో ఈ సీజన్‌ లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా, పశ్చిమగోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం ప్రాంతాల్లో 47.3 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 47.1 డిగ్రీలు నమోదు అయ్యాయి. కోనసీమ జిల్లా రామచంద్రాపురం, కాకినాడ జిల్లా కాజులూరులో 46.5 డిగ్రీలు, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.2 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో 45.7 డిగ్రీలు, విశాఖ రూరల్‌లో 45.6 డిగ్రీలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా కారేడులో 45.5, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.2, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. 17 జిల్లాల పరిధిలోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో 23 మండలాలు, తూర్పుగోదావరిలో 21, పశ్చిమగోదావరిలో 17, కృష్ణాలో 16, బాపట్లలో 15 మండలాల్లో ఎండల ఉధృతి అధికంగా కనిపించింది. సోమవారం 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మంగళవారం ఈ ప్రభావం మరింత పెరిగి 50 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 205 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

మే 25 సోమవారం కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండొచ్చని తెలిపింది. ఇక శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 40 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరోవైపు ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కూడా చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని APSDMA హెచ్చరించింది.