Site icon NTV Telugu

Ajit Doval Story: పాకిస్థాన్‌లో ఏడేళ్లు బిచ్చగాడిలా బతికిన అసలైన “ధురంధర్”.. దోవల్ మిషన్ సినిమాకంటే థ్రిల్లింగ్!

Ajit Doval

Ajit Doval

Ajit Doval story: ఆదిత్య ధర్ చిత్రం ‘ధురందర్ 2’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ‘ధురందర్’లో ఆర్. మాధవన్‌ పాత్ర చాలా చిన్నదే కానీ.. నిజ జీవితంలో మాత్రం ఈ పాత్ర మామూలుది కాదు.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర, వాస్తవానికి ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ ఆధారంగా రూపొందించారు. ఈ తరుణంలో జనాలు అజిత్ దోవల్ గురించి తెలుసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి అజిత్ దోవల్ గురించి తెలిసే ఉంటుంది. నిజ జీవితంలో అజిత్ దోవల్, హమ్జా అలీ మజారీ (అకా జస్కిరత్ సింగ్ రంగి) కంటే ఎన్నో డేంజర్ మిషన్లు నిర్వహించారు. ఇప్పటికీ 81 ఏళ్ల వయసులోనూ దేశం కోసం సేవలు అందిస్తున్నారు. అజిత్ దోవల్ నిజ జీవితంలో నిర్వహించిన ఒక డేంజర్ మిషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

READ MORE: Varanasi Update: ఫాస్ట్ ట్రాక్‌లో ‘వారణాసి’ షూటింగ్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?

భారతదేశం తన తొలి అణు పరీక్షను 1974లో మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించింది. దీన్నే ‘స్మైలింగ్ బుద్ధ’ అనే కోడ్‌నేమ్‌తో పిలుస్తారు. రెండవ సారి 13 మే 1998లలో అణు పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. భారత్ అణు పరీక్షల తర్వాత పాకిస్థాన్ అణ్వస్త్ర సాధనలో దూకుడుగా వ్యవహరించింది. చైనా వంటి దేశాల మద్దతుతో ఎలాగైనా అణ్వాయుధాలను సంపాదించాలనే పట్టుదలతో పాకిస్థాన్ ముమ్మర ప్రయత్నాలు చేసింది. ఇక్కడే భారత్ కీలక అడుగు వేసింది. పాకిస్థాన్ అణు రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలనుకుంది. అప్పుడే అసలైన ధురంధర్ అజిత్ దోవల్ పేరు వెలుగులోకి వచ్చింది. పాక్ అణు రహస్యాన్ని బయటపెట్టే బాధ్యతను సూపర్ కాప్‌గా గుర్తింపు పొందిన అజిత్ దోవల్‌కు నాటి భారత ప్రభుత్వం అప్పగించింది. దీంతో తన కుటుంబాన్ని వదిలేసి పాకిస్థాన్ రహస్యాలను తెలుసుకునేందుకు బయలుదేరారు అజిత్. ఇస్లామాబాద్‌ సమీపంలోని ఖహూటా బయటకు మాత్రం ఓ సాధారణ పట్టణం. కానీ, అక్కడి ఖాన్ రిసెర్చ్ ల్యాబొరేటరీస్ (KRL)లోనే పాక్ అణు పరిశోధనలు సాగించింది. దేశాల విధిని మార్చగలిగే రహస్యాలను కాపాడుకోడానికి అక్కడ శాస్త్రవేత్తలు, భద్రతా సిబ్బంది, ప్రభుత్వ అధికారులు కఠినమైన నిబంధనలు అనుసరించేవారు. ఒక చిన్న పొరపాటు జరిగితేనే రహస్యాలన్నీ బయటపడే ప్రమాదం ఉంది. అయితే, ఆ వాతావరణంలో కలిసిపోయిన దోవల్.. ఇందుకోసం అజిత్ దోవల్ ఇస్లాం మతంలోకి మారారు. ఆ సమాజంలో పూర్తిగా కలిసిపోయారు. ఉర్దూను ఎంత అనర్గళంగా మాట్లాడేవారంటే, ఆ విషయం ఎవరికీ అనుమానం రాలేదు. ఒకసారి లాహోర్‌లోని ఒక మసీదు బయట ఒక వృద్ధుడు ఆయనను గుర్తుపట్టాడు. ఆ వృద్ధుడు అజిత్ దోవల్‌తో, “అబ్బాయి, నీ చెవులు కుట్టించుకున్నావు; నువ్వు హిందువువి” అన్నాడు. దానికి దోవల్ చాకచక్యంగా తాను చిన్నప్పుడు చెవులు కుట్టించుకుని, ఆ తర్వాత ఇస్లాం మతంలోకి మారానని బదులిచ్చాడు. దీంతో ఎవ్వరికీ అనుమానం రాలేదు.

READ MORE: Diamond Dacoit Challenge: హుక్ స్టెప్‌ వేయండి, లక్ష పట్టండి.. వినూత్నంగా మూవీ ప్రమోషన్స్!

మాసిన గెడ్డం, చినిగిన దుప్పటితో బిచ్చగాడి వేషంలో 1980వ దశకంలో ఒకటి రెండు కాదు దాదాపు ఏడేళ్ల పాటు పాకిస్థాన్ వీధుల్లో తిరిగారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకున్న అజిత్ దోవల్.. బిచ్చగాడి వేషంలో తలదాచుకున్నారు. ఒంటిపై చిరిగిన దుప్పటి, నెరసిన జుట్టు, మాసిన గెడ్డంతో చూసేవారికి దయ, జాలికోసం చేతులు చాచే అభాగ్యుడిలా కనిపించేవారు. కానీ ఆ వేషం వెనుక ఒక ముఖ్యమైన గూఢచారి, అత్యంత చురుకైన మేధావి దాగి ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో దోవల్‌కు నిజమైన బ్రేక్‌థ్రూ ఒక చిన్న సెలూన్ దుకాణంలో దొరికింది. ఆ సెలూన్‌కు కేఆర్ఎల్ శాస్త్రవేత్తలు తరచూ వచ్చి క్షవరం చేయించుకునేవారు. వారి జుట్టును ఎవరికీ తెలియకుండా దోవల్ జాగ్రత్తగా సేకరించి నమూనాలను భారత్‌కు పంపారు. దీనిని ల్యాబ్‌లో పరీక్షించగా యురేనియం, రేడియేషన్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో పాకిస్థాన్ అణ్వస్త్ర తయారీ దిశగా అడుగులు వేస్తున్నట్టు భారత్‌కు స్పష్టమైంది. ఈ గూఢచర్య సమాచారంతో భారత తన జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకుంది. దోవల్ వల్ల పాకిస్థాన్ అణు సామర్థ్య పరీక్షలు దాదాపు 15 ఏళ్లు ఆలస్యమయ్యాయి. ఇలా దేశం కోసం ఆరేళ్లు పాకిస్థాన్‌లో గడిపిన అజిత్ దోవల్ అసలైన ధురంధర్. అందుకే ఆయనను భారత ‘జేమ్స్ బాండ్’ అని కూడా పిలుస్తుంటారు.

Exit mobile version