పాకిస్తాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులతో వెళ్తున్న ఒక ట్రక్కు శనివారం తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదానికి గురైంది. రాజధాని కాబూల్ను నంగర్హర్ ప్రావున్స్తో అనుసంధానించే ప్రధాన రహదారిపై, లగ్మన్ ప్రావిన్స్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కనీసం 22 మంది మరణించగా, మరో 36 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో ట్రక్కు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న లోయలో (కాలువలో) పడిపోయింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నట్లు ప్రావిన్షియల్ అధికారులు ధృవీకరించారు. మరణించిన వారిలో 10 మంది చిన్నపిల్లలు, ఐదుగురు మహిళలు ఉన్నారని గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ మాలిక్ నియాజాయ్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంగర్హర్లోని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ట్రక్కులోని ప్రయాణికులు ఇటీవల పాకిస్తాన్ నుంచి బలవంతంగా వెళ్లగొట్టబడిన, లేదా ఒత్తిడి కారణంగా స్వదేశానికి తిరిగి వస్తున్న వేలాది మంది ఆఫ్ఘన్ వలసదారులలో భాగమే. 2023లో పాకిస్తాన్ అక్రమ వలసదారులపై తీవ్రమైన చర్యలు ప్రారంభించినప్పటి నుంచి లక్షలాది మంది ఆఫ్ఘన్లు తమ మాతృభూమికి తిరిగి వస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్తాన్లోనే జన్మించి, దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్నవారు కావడం గమనార్హం. అదే సమయంలో ఇరాన్ కూడా ఆఫ్ఘన్ వలసదారులను పెద్ద ఎత్తున బహిష్కరిస్తోంది.
మరో ప్రమాదం..
ఇదిలా ఉండగా.. తూర్పు ప్రావిన్స్ అయిన నూరిస్తాన్లో శుక్రవారం రాత్రి జరిగిన మరొక ప్రమాదంలో ఒక కారు రోడ్డుపై నుంచి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ గాయపడగా, కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు గల్లంతయ్యారు. వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో సరైన రహదారి సౌకర్యాలు లేకపోవడం, శతాబ్దాల తరబడి దెబ్బతిన్న రోడ్లు, డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి.
