Abhijeet Dipke: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసేంత వరకు విద్యార్థుల పోరాటం ఆగేదే లేదని ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే తీవ్ర స్థాయిలో స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి చర్చలకు ప్రయత్నించినా, ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించినా.. తమ ఉద్యమ ప్రధాన డిమాండ్లో ఎలాంటి మార్పూ ఉండబోదని తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప ప్రత్యామ్నాయం లేదని, రాజీనామా ఇచ్చే వరకు ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని దిప్కే ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఉద్యమం కేవలం సోనమ్ వాంగ్చుక్కో, అభిజీత్ దిప్కేకో లేదా ప్రతిపక్ష పార్టీలకో పరిమితమైంది కాదని, ఇది దేశంలోని నిరుద్యోగ యూత్ మొత్తం కలసికట్టుగా చేపట్టిన ఓ భారీ పోరాటమని అభిజీత్ దీప్కే ఉద్ఘాటించారు. మరోవైపు, సోనమ్ వాంగ్చుక్ను ఒకరకంగా గృహనిర్బంధంలో ఉంచారని దిప్కే సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను వాంగ్చుక్ను కలవడానికి అనుమతించిన పోలీసులు.. ప్రతిపక్ష ఎంపీలను, చివరికి CJP నాయకులను మాత్రం ఆయన వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అయినప్పటికీ, వాంగ్చుక్ సర్ తన ఆరోగ్య దృష్ట్యా దీక్ష విరమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు, దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో రంగంలోకి దిగిన CJP ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా అక్కడ నుంచి బయలుదేరి కేంద్ర మంత్రులతో సమావేశమయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే విద్యార్థుల ఆందోళనలు, వారి కీలక డిమాండ్లపై చర్చించేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి బృందానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య కాన్స్టిట్యూషన్ క్లబ్లో కీలక సమావేశం ప్రారంభమైంది. సీజేపీ జాతీయ స్థాయిలో చేస్తున్న ఈ ఆందోళనలు ఎలాంటి మలుపు తిరుగుతాయో, ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల్లో ఏం తేలుతుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

